వికారాబాద్ జిల్లా ప్రజలకు త్వరలోనే ఆయుష్ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. జిల్లా స్థాయి ఆయుష్ దవాఖాన నిర్మాణంతోపాటు జిల్లావ్యాప్తంగా పది ఆయుష్ వెల్నెస్ సెంటర్ల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పంచకర్మ, యోగ, కప్లింగ్ థెరపీ వంటి వైద్య సేవలు ప్రజలకు అందనున్నాయి. ఒక్కొక్క వెల్నెస్ సెంటర్కు రూ.10లక్షల చొప్పున రూ.కోటి నిధులు ఇప్పటికే మంజూరు కాగా, త్వరలోనే పనులు ప్రారంభించనున్నారు. ప్రతి కేంద్రంలో ఒక వైద్యుడు, ఇద్దరు యోగా నిపుణులు సేవలందించనున్నారు. రాష్ట్ర ఆయుష్ కమిషనర్ వర్షిణి, నోడల్ అధికారి డాక్టర్ లింగరాజు త్వరలో జిల్లాలో పర్యటించి పనులను పర్యవేక్షించనున్నారు.
పరిగి, మార్చి 23 : ఆయుష్ వైద్య సేవలు త్వరలోనే జిల్లా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ప్రధానంగా పంచకర్మ, యోగా, కప్లింగ్ థెరపీ వంటి వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేకంగా జిల్లాస్థాయిలో ఆయుష్ దవాఖాన సైతం ఏర్పాటు చేయనున్నారు. వికారాబాద్లో ఈ దవాఖాన నిర్మాణానికి స్థల పరిశీలన కూడా చేపట్టారు. ప్రస్తుతమున్న ఆయుష్ దవాఖానల ఆవరణల్లో ప్రత్యేకంగా యోగా సెంటర్లను నెలకొల్పడానికి నిర్ణయించారు. వికారాబాద్ జిల్లా పరిధిలో 10 ఆయుష్ వెల్నెస్ సెంటర్ల ఏర్పాటుకు నిర్ణయించి నిధులు కూడా మంజూరు చేశారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పనులు చేపట్టడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వెల్నెస్ సెంటర్, ఆయుష్ దవాఖానకు సంబంధించి స్థల పరిశీలనకు రాష్ట్ర ఆయుష్ కమిషనర్ అలుగు వర్షిణి, నోడల్ అధికారి డాక్టర్ లింగరాజు వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్నట్లు సంబంధిత శాఖ అధికారులు తెలిపారు.
వికారాబాద్ జిల్లా పరిధిలో పది వెల్నెస్ సెంటర్ల ఏర్పాటుకు రూ.కోటి ఖర్చు చేయనున్నారు. వికారాబాద్ జిల్లా పరిధిలో నవాబుపేట్, మోమిన్పేట్లలో హోమియో దవాఖానలు, దోమ, దుద్యాల, దౌల్తాబాద్, తాండూరులలో ఆయుర్వేద దవాఖానలు, వికారాబాద్, పట్లూర్, తాండూరు, పరిగిలలో యునాని దవాఖానలు ఉన్నాయి. ఈ మేరకు వికారాబాద్ జిల్లాలో ఆయుష్ ఆధ్వర్యంలో పది వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. నేషనల్ ఆయుష్ మిషన్ కింద ఒక్కో కేంద్రానికి రూ.10లక్షలు విడుదల చేశారు. ఇందులో రూ.6లక్షలు మౌలిక వసతుల కల్పన కోసం ఖర్చు చేయనున్నారు. ఇందులోభాగంగా యోగా కోసం షెడ్డు నిర్మాణం చేపట్టడంతోపాటు దవాఖానల్లో చిన్నచిన్న మరమ్మతులు.. ప్రధానంగా మరుగుదొడ్లు, దవాఖాన తలుపులు, కిటికీలు, ఎలక్ట్రికల్కు సంబంధించిన మరమ్మతు పనులు చేపట్టనున్నారు. రూ.2లక్షలు వైద్యుల కోసం ఖర్చు చేయనుండగా, మరో రూ.2లక్షలు మందుల కోసం వెచ్చించనున్నారు.
వికారాబాద్లో ఆయుష్ జిల్లాస్థాయి దవాఖాన ఏర్పాటుకు ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించి వికారాబాద్ ఏరియా దవాఖాన సమీపంలో స్థలాన్ని కూడా సంబంధిత శాఖ అధికారులు పరిశీలించారు. త్వరలోనే స్థలాన్ని నిర్ణయించి ఆయుష్ దవాఖాన నిర్మాణం చేపట్టనున్నారు. జిల్లా ఆయుష్ దవాఖానలో ఆయుర్వేదం, యునాని, యోగా, నేచురోపతి తదితర వైద్యసేవలు అందుతాయి. నడుంనొప్పి, వెన్నునొప్పి వంటి వాటికి, రోగిని బట్టి సెషన్స్ నిర్ధారించి పంచకర్మ థెరపీ కూడా ఉచితంగా అందజేయనున్నట్లు సమాచారం. నేచురోపతి ద్వారా డైట్ కౌన్సిలింగ్ కూడా ఇవ్వనున్నారు. నొప్పులు తగ్గించడం కోసం యునానిలో కప్లింగ్ థెరపీ, రెజిమెంటల్ థెరపీని జిల్లా ఆయుష్ దవాఖానల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. వెల్నెస్ సెంటర్ల ఏర్పాటు, జిల్లా స్థాయి దవాఖానకు సంబంధించి స్థలాన్ని పరిశీలించేందుకు ఆయుష్ కమిషనర్ అలుగు వర్షిణి త్వరలో వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.
జిల్లాలోని పదిచోట్ల ఏర్పాటు చేయనున్న ఆయుష్ వెల్నెస్ సెంటర్లలో స్థానికులకు యోగాలో శిక్షణ ఇవ్వనున్నారు. ఇద్దరు ఇన్స్ట్రక్టర్లను యోగా శిక్షణ ఇచ్చేందుకు నియమిస్తారు. నెలకు మహిళా ఇన్స్ట్రక్టర్ 28 క్లాసులు, పురుష ఇన్స్ట్రక్టర్ 32 క్లాసులు నిర్వహిస్తారు. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో వారిలో ఇమ్యూనిటీ పెంచేందుకు ఈ యోగా దోహదం చేస్తుందని చెబుతున్నారు. మధుమేహం, బీపీ, మెడ, నరాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారికి, ఇతరులకు యోగాలో శిక్షణ ఇప్పిస్తారు. ప్రతిరోజూ ప్రాణాయామం, యోగా చేయడం ద్వారా శరీరంలో ఇమ్యూనిటీ శక్తి పెరుగుతుందని వారు పేర్కొంటున్నారు. త్వరలోనే వెల్నెస్ సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా యోగా షెడ్డు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ప్రతి వెల్నెస్ సెంటర్లో ఒక వైద్యుడితోపాటు ఇద్దరు యోగా ఇన్స్ట్రక్టర్లు, ఒక సహాయకుడిని నియమించనున్నారు.