ధారూరు : యువత డాక్టర్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. మంగళవారం ధారూరు మండల పరిధిలోని కుకింద గ్రామంలో నూతనంగా స్థాపించిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయసాధనకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం దళితుల అభివృద్ధి కోసం దళితబంధు పథకం ప్రవేశపెట్టి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. దళితులపై అంటరానితనాన్ని తొలిగించాలని ఎంతో కృషి చేసిన వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే ఆనంద్ను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, విగ్రహ దాతలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.