వికారాబాద్ : రైతులందరూ తమ ఉత్పత్తులను మార్కెట్ యార్డులోనే అమ్ముకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. గురువారం మార్కెట్ కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మార్కెట్యార్డులో ఉత్పత్తుల అమ్మకం వలన రైతులు అధిక లాభాలు పొందవచ్చాన్నారు. రైతులందరికీ కనీస మద్ధతు ధర వచ్చే విధంగా కృషి చేయాలన్నారు. తూకం సమయంలో అవకతవకలు జరుగకుండా మార్కెట్ కమిటీ యంత్రాంగం పర్యవేక్షణ చేయాలని సూచించారు.
రైతులు ఉత్పత్తులు అమ్ముకోవడానికి వచ్చిన సమయంలో సరళీకృతంగా అమ్మకాలు చేయుటకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వివరించారు. అనంతరం పాలక వర్గ సభ్యులు ముఖ్య అతిథులకు సన్మానం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ముద్ద దీప, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి, మార్కెట్ కమిటీ కార్యదర్శి వెంకట్రెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.