పరిగి, నవంబర్ 30 : వికారాబాద్ జిల్లా పరిధిలో కొత్త మద్యం దుకాణాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 2021-23 సంవత్సరాలకు సంబంధించి జిల్లా పరిధిలో మొత్తం 59 మద్యం దుకాణాలకు సంబంధించిన లైసెన్సుదారుల ఎంపిక పారదర్శకంగా జరిగింది. కొత్తగా మద్యం దుకాణాలు దక్కించుకున్న లైసెన్సుదారులకు మద్యం అమ్మకాల కోసం ఎక్సైజ్ అధికారులు అనుమతి ఇచ్చారు. జిల్లాలోని 59 మద్యం దుకాణాల్లో ఎస్సీలకు 9, గౌడ్లకు 6, ఎస్టీలకు 2 దుకాణాలు రిజర్వు చేయబడ్డాయి. జిల్లా పరిధిలో రూ.60లక్షల స్లాబ్లో 17 మద్యం దుకాణాలు, రూ.55లక్షల స్లాబ్లో 28 దుకాణాలు, రూ.50లక్షల స్లాబ్లో 14 దుకాణాలున్నాయి. కొత్త మద్యం పాలసీ ప్రకారం దుకాణం టర్నోవర్ 10 రెట్లు దాటిన తర్వాతే టాక్స్ ఉంటుంది. బ్యాంకు గ్యారంటీ సంవత్సరం స్లాబ్పై 25శాతం ఉంటే సరిపోతుంది. సాధారణ మద్యంపై 27శాతం, మీడియం, ప్రీమియం బ్రాండ్లపై 20శాతం మార్జిన్ ఉంటుంది. మద్యం దుకాణాల్లో వాక్ ఇన్ సదుపాయం కల్పించడంతో వినియోగదారుడు తనకు నచ్చిన బ్రాండ్ మద్యం తీసుకునే అవకాశం ఉంది. మొదట నవంబర్ 9 నుంచి 18 వరకు దరఖాస్తులు స్వీకరించగా 59 దుకాణాలకు 837 దరఖాస్తులు వచ్చాయి. నవంబర్ 20వ తేదీన దరఖాస్తులు తక్కువగా వచ్చిన 6 మినహా మిగతా 53 దుకాణాలకు లాటరీ పద్ధతిలో లైసెన్సుదారుల ఎంపిక చేపట్టారు. మొదటి విడుతలో లైసెన్సుదారుల ఎంపిక పూర్తయిన 53 మద్యం దుకాణాలకు సంబంధించినవారు మద్యం కొనుగోలు కోసం డీడీలు చెల్లించి, దుకాణాల ఏర్పాటుకు సన్నాహాలు చేశారు.
6 మద్యం దుకాణాలకు లాటరీ పద్ధతిలో ఎంపిక
జిల్లాలో మిగిలిన 6 మద్యం దుకాణాలకు మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశపు హాలులో జిల్లా కలెక్టర్ నిఖిల లాటరీ పద్ధతిలో లైసెన్సుదారులను ఎంపిక చేశారు. జిల్లా పరిధిలోని యాలాల వీకేబీ017, కొడంగల్ వీకేబీ052, కొడంగల్ వీకేబీ053, కొడంగల్ వీకేబీ054, రావులపల్లి వీకేబీ055, దౌల్తాబాద్ వీకేబీ056 మద్యం దుకాణాలకు మొత్తం 120 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన లాటరీ ప్రక్రియలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ వరప్రసాద్, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు. మంగళవారం మద్యం దుకాణాలు దక్కించుకున్నవారు కూడా డిసెంబర్ 1 నుంచి మద్యం దుకాణాలు ప్రారంభించేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. జిల్లా పరిధిలోని 59 దుకాణాలకు మొత్తం 919 దరఖాస్తులు రావడంతో ఒక్కో దరఖాస్తుకు రూ.2లక్షల చొప్పున ప్రభుత్వానికి రూ.18.38కోట్లు ఆదాయం సమకూరింది. ఇప్పటికే మద్యం దుకాణాలు దక్కించుకున్న లైసెన్సుదారులు వ్యాపారం అధికంగా కొనసాగే ప్రాంతాల్లో దుకాణాలు ఏర్పాటు చేశారు.