రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్
వికారాబాద్, జూలై 28 : ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్ పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా గ్రంథాలయాన్ని సందర్శించి, నూతనంగా నిర్మిస్తున్న గ్రంథాలయ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వికారాబాద్ను జిల్లా చేయడంతో పాటు , చార్మినార్ జోన్లో కలుపడం సంతోషంగా ఉందన్నారు. జోనల్ వ్యవస్థ ద్వారా స్థానికులకు 95శాతం ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. పట్టణ, గ్రామీణ ప్రాంతానికి చెందిన వారు పోటీ పరీక్షలకు సంసిద్ధం అయ్యేందుకు ఈ గ్రంథాలయాలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. మండల స్థాయిలో కూడా గ్రంథాలయాలను నెలకొల్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. వికారాబాద్ జిల్లాలో 4,5 గ్రంథాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షలకు సంసిద్ధమవుతున్న వారికి త్వరలో పోటీ పుస్తకాలతో పాటు నిపుణులైన ప్రొఫెసర్లతో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. మంత్రి సబితారెడ్డి సహకారంతో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి గ్రంథాలయాల అభివృద్ధికి మరింతగా కృషి చేస్తామని సూచించారు. ఇంజినీరింగ్, మెడిసిన్ విద్యార్థులకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామని వివరించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణగౌడ్ మాట్లాడుతూ నిరుద్యోగులకు నైపుణ్యత, శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అనంతరం రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్ను వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణగౌడ్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సురేష్బాబు, వికాస్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, సిద్దార్థ స్కూల్ ప్రిన్సిపాల్ వేణుగోపాల్, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.
పాఠకులకు మరింత సౌకర్యంగా పరిగి గ్రంథాలయం
పరిగి, జూలై 28 : పాఠకులకు మరింత సౌకర్యంగా పరిగి గ్రంథాలయాన్ని తీర్చిదిద్దుతామని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. బుధవారం నారాయణపేట్ జిల్లా పర్యటనకు వెళ్తున్న రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్ పరిగిలో ఎమ్మెల్యే మహేశ్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పరిగిలోని గ్రంథాలయం భవనం పైభాగంలో హాల్, ఇతర నిర్మాణాలకు కోటి రూపాయలతో ప్రతిపాదనలు పంపించామని, త్వరగా ఆమోదించి, టెండర్లు పిలువాల్సిందిగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం గ్రంథాలయంలో అవసరమైన మెటీరియల్ సైతం అందుబాటులో ఉంటుందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణలను ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గోపాల్రెడ్డి పాల్గొన్నారు.