సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ): మణప్పురం గోల్డ్ సంస్థ అందుబాటులోకి తెచ్చిన డోర్ స్టెప్ గోల్డ్ లోన్ స్కీమ్ను స్కామ్గా మార్చిన భువనేశ్వర్ ముఠాను సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. జాయింట్ సీపీ అవినాశ్ మహంతి కథనం ప్రకారం.. ఒడిశా భువనేశ్వర్లోని మణప్పురం సంస్థ కార్యాలయంలో స్థానికుడైన అదిత్య నారాయణ మహాపాత్ర పనిచేస్తున్నాడు. తన స్నేహితులైన లక్ష్మీధర్ ముర్ము, ప్రమోద్ నాయక్, సౌమ్య రంజన్ పట్నాయక్ , దేబషిష్ ఓజాలతో కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. డోర్స్టెప్ గోల్డ్ స్కీమ్పై అవగాహన ఉన్న అదిత్య నారాయణ, హైదరాబాద్లోని హిమాయత్నగర్ శాఖ కార్యాలయానికి ఫోన్ చేశాడు. నేను కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాను.. మీ సీసీ కెమెరాలు సరిగా పనిచేయడం లేదంటూ ఇద్దరు ఉద్యోగులకు సంబంధించిన యూజర్ ఐడీలు, పాస్వర్డ్లు అడిగి సేకరించాడు.
వాటితో గోల్డ్ లోన్ కోసం డమ్మీ దరఖాస్తులు చేసి, తనకున్న అనుభవంతో అక్రమ మార్గంలో లోన్పొందాడు. కేంద్ర కార్యాలయం నుంచి రూ. 30 లక్షలు కూడా జమయ్యాయి. నిందితులు దరఖాస్తులో సూచించిన బంగారం హిమాయత్నగర్ బ్రాంచ్లో కనిపించకపోవడంతో స్కామ్ జరిగినట్లు బ్రాంచ్ మేనేజర్ గుర్తించి సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు భువనేశ్వర్లో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. వారిబ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ. 10 లక్షలు ఫ్రీజ్ చేసి, ఆరు మొబైల్ ఫోన్లు, ఒక డెబిట్ కార్డు, బ్యాంకు పాస్ పుస్తకాన్ని స్వాధీనం చేసుకున్నారు.