నల్లగొండ: కరోనా కేసులు తగ్గినప్పటికీ ఇంకా అక్కడక్కడ కొత్తగా నమోదవుతున్నాయని, వాటి నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వి అన్నారు. రిజ్వీ నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం ఆదివారం నల్లగొండ జిల్లా వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించింది. హెలికాప్టర్లో పలు జిల్లాలకు బయలుదేరిన రిజ్వి బంధం ముందుగా నాగార్జునసాగర్ చేరుకున్నది. విజయవిహార్ అతిథిగృహంలో నాగార్జునసాగర్ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి పరిస్థితులపై ప్రత్యేకంగా రివ్యూ జరిపారు. తీసుకోవాల్సిన చర్యలపై తగు సూచనలు చేసారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాలతో క్షేత్ర స్థాయిలో పర్యటించి, కరోనా విస్తరణకు గల కారణాలను లోతుగా అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. కరోనా నియంత్రణకు ముందస్తుగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రణాళికలు రచించినట్లు వెల్లడించారు. వైద్య అధికారులు, సిబ్బంది ప్రజలను అప్రమత్తం చేస్తూ కరోనా నియంత్రణకు మరింత కృషి చేయాలని సూచించారు. సరిహద్దు జిల్లాల్లోని కరోనా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అధికారుల బృందం సాగర్ నుంచి మిర్యాలగూడ, నకిరేకల్, సూర్యాపేట నియోజకవర్గాల్లో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. రిజ్వి వెంట డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేష్ రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డీఎంహెచో కొండల్ రావు, ఇతర వైద్య అధికారులు, తదితరులు ఉన్నారు.