మంచిర్యాల, జూలై 9, నమస్తే తెలంగాణ: గతంలో చెత్తాచెదారంతో అస్తవ్యస్తంగా ఉన్న పల్లెలు నేడు అందంగా ముస్తాబయ్యాయి. చెత్త, పిచ్చి మొక్కల తొలగింపు, నీటి నిల్వలు లేకుండా చూడడం, డ్రైనేజీ శుభ్రం చేయడం వంటి పారిశుధ్యపనులతో అందంగా దర్శనమిస్తున్నాయి. గ్రామాలకు ప్రభుత్వం అందించిన ట్రాక్టర్, ట్రాలీలను సద్వినియోగం చేసుకుంటున్నారు. పారిశుధ్య కార్మికులు తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్నారు. డంప్యార్డులకు తరలిస్తున్నారు. చెత్తతో ఎరువుల తయారీతో పాటు సంపద సృష్టిస్తున్నారు. దీంతో అపరిశుభ్రత దూరమవుతున్నది. మురుగు కాలువలు తరచూ శుభ్రం చేస్తున్నారు. బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమష్టి భాగస్వామ్యంతో పల్లెలను రోగరహిత గ్రామాలుగా తీర్చిదిద్దుకుంటున్నారు. ఇండ్ల ముందు మురుగు గుంతలు లేకుండా మట్టివేసి చదును చేస్తున్నారు. ఇండ్ల మధ్య ఉన్న పాత ఇండ్లను కూల్చి వేయడంతో పందులు ఊరికి దూరంగా తరలివెళ్తున్నాయి. పిచ్చిమొక్కలు, ముళ్ల చెట్లను ఎక్స్కవేటర్ సహాయంతో తొలగిస్తున్నారు. నీటి ట్యాంకులు, మూలలు, చేతిపంపుల వద్ద నీరు నిల్వకుండా సామాజిక ఇంకుడు గుంతలు నిర్మించారు. తాగు నీటి ట్యాంకులను తరచూ శుభ్రం చేయడంతో పాటు క్లోరినేషన్ చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో పారిశుధ్య సమస్య తీరుతున్నది. ప్రతి వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు కూడా దూరమయ్యాయి. కరోనా నేపథ్యంలో ప్రజలు వ్యక్తిగత, పరిసరాల శుభ్రత పాటించారు. శుభ్రతతోనే రోగాలు దూరమవుతాయనే అవగాహనతో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. అధికారులకు సహకరించడంతో పాటు సమష్టి సహకారంతో ఊళ్లను బాగు చేసుకుంటున్నారు.
పల్లెల్లో దూరమైన వ్యాధులు ..
క్రమం తప్పకుండా పారిశుధ్య పనులు చేపడుతుండడంతో పల్లెల్లో ప్రతి వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు దూరమవుతున్నాయి. పిచ్చిమొక్కలు, పాడుబడ్డ ఇండ్లు తొలగించడంతో పాములు, తేళ్ల వంటి విషపురుగులు, పందుల సంచారం తగ్గింది. ఇంటింటికీ శుద్ధ జలం అందించడం, నీళ్లను క్లోరినేషన్ చేయడం, నీళ్ల ట్యాంకుల వద్ద మురుగు తొలగించడంతో గ్రామీణ పల్లెలు ఆరోగ్యంగా మారాయి. కరోనా కంటే ముందు ఆందోళన కలిగించిన స్వైన్ ఫ్లూ హెచ్1ఎన్1 వైరస్ సైతం దూరమైంది. ఇక కలుషిత నీటి సంక్రమిత అతిసార, విరేచనాలు, టైఫాయిడ్ వంటి వ్యాధులు తగ్గుముఖం పట్టాయి. ఒకప్పుడు వర్షాకాలం వచ్చిందంటే దవాఖానల ముందు క్యూలు కట్టే ప్రజలు నేడు ఇండ్లకే పరిమితమవుతున్నారు. వ్యాధిబారిన పడ్డవారు సైతం ఒకరిద్దరు మాత్రమే ఉండడం పల్లె ప్రగతి సత్ఫలితాలకు అద్దం పడుతున్నది. కరోనా నేపథ్యంలోనూ ప్రజల్లో చాలా మార్పులు వచ్చాయి. వివిధ శాఖల అధికారులు నిర్వహించిన అవగాహన కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం వచ్చింది. వ్యక్తిగత, పరిసరాల శుభ్రత పాటిస్తున్నారు. 2018లో 773 ఫైలేరియా కేసులు నమోదు కాగా, తాగునీటిపై గ్రామాల్లో చేపడుతున్న చర్యలతో తగ్గుముఖం పట్టాయి. 2019లో 18 కేసులు నమోదు కాగా, 2020లో వాటి సంఖ్య 5కు పడిపోయింది. ఇది పల్లెపల్లెనా మెరుగుపడుతున్న ఆరోగ్యంతో వాటి సంఖ్య ఏటా పడిపోతూ, అంకెల్లో నమోదవుతూ వస్తున్నది. మలేరియా, డెంగీ, చికున్ గున్యా, ఫైలేరియా, జపనీస్ ఎన్సెఫాలిటీస్ (జేఈ) వ్యాధి గ్రస్తులు దాదాపు సింగిల్ డిజిట్లకే పరిమితమయ్యారు. మలేరియా వ్యాధిగ్రస్తుల సంఖ్య 2018లో 3, 2019లో 2 నమోదు కాగా, 2020లో కొంత పెరిగి 11కు చేరింది. ఈ యేడాది ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదుకాకపోవడం విశేషం. డెంగీ కేసులు కూడా 2018లో 53, 2019లో 346, 2020లో 32 నమోదు కాగా, ఇప్పటి వరకు ఐదుగురికి మాత్రమే వచ్చింది. చికున్ గున్యా కూడా 2018, 2019, 2020లో మూడేసి కేసులు నమోదు కాగా, ఈ యేడాదిలో ఇప్పటి వరకు ఒక్కరికి కూడా రాకపోవడం పరిస్థితి మెరుగుకు అద్దం పడుతున్నది.
తగ్గిన సీజనల్ వ్యాధులు..
పల్లె ప్రగతితో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు భారీగా తగ్గాయి. గ్రామాల్లో వైద్య, పంచాయతీ శాఖలు కల్పించిన అవగా హనతో ప్రజలు కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. వ్యక్తిగత, పరిసరాల శుభ్రత పాటిస్తున్నారు. పల్లెలో నీరు కలుషితం కాకుండా బ్లీచింగ్ పౌడర్ పిచికారీ చేయించాం. ఫాగింగ్ చేపట్టాం. దీంతో సీజనల్ వ్యాధులు భారీగా తగ్గాయి. స్వైన్ ఫ్లూ, చికున్గున్యా, డెంగీ, టైఫాయిడ్ , మలేరియా వంటి కేసులు కూడా చాలా వరకు తగ్గుముఖం పట్టాయి.
పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం..
మంచిర్యాల ఏసీసీ : పల్లెల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. సిబ్బంది ఉదయమే ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరి స్తున్నది. రోడ్లపై ఉన్న చెత్తాచెదారాన్ని ట్రాక్టర్ సహాయంతో డంప్ యార్డుకు తరలిస్తున్నాం. మురుగు కాలువలను శుభ్రం చేయిస్తున్నాం. బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తున్నాం. దోమల నివారణకు మందును పిచికారీ చేయిస్తున్నాం. ఆరోగ్య గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. అధికారుల ఆదేశాలను పాటిస్తూ పారిశుధ్య చర్యలు తీసుకుంటున్నాం.
బ్లీచింగ్ చేయిస్తున్నాం..
చెన్నూర్ రూరల్ : మా గ్రామంలో రోజూ రోడ్లపై చెత్తాచెదారాన్ని ఊడిపిస్తున్నం. మురుగు కాలువలు శుభ్రం చేయిస్తున్నం. మట్టిని, చెత్తను ట్రాక్టర్ ట్రాలీతో డంప్యార్డుకు తరలిస్తున్నం. నీళ్లు నిలువ ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నం. మట్టి వేసి, ఫాగింగ్ చేయిస్తున్నం. రెగ్యులర్గా బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తున్నం.