బీఈడీ ప్రవేశ పరీక్షలో మౌలిక మార్పులు
సర్కార్ నిర్ణయంతో విద్యార్థులకు లబ్ధి
కోర్సును సద్వినియోగం చేసుకోవాలి
కేయూ వీసీ ప్రొఫెసర్ రమేశ్, ఎడ్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రామకృష్ణ
భీమారం, జూలై 5: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) టీఎస్ఎడ్సెట్-2021 విద్యా వ్యవస్థ పటిష్టకు సమగ్ర అద్యాయనం అవసరమని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ప్రవేశ పరీక్ష పత్రంలోమౌలిక మార్పులు చేసినట్లు కాకతీయ యూ నివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ తెలిపారు. కామన్ సిలబస్తో కామన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తున్నామని, డిగ్రీ చదివే విద్యార్థులకు ఈ విధానం ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సోమవారం కేయూ సెనెట్ హాల్ లో ఎడ్సెట్-2021 ప్రవేశ పరీక్ష విధానంలో వచ్చిన మా ర్పులపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు ఎడ్సెట్లో డిగ్రీలోని సిలబస్ ప్రామాణికంగా తీసుకుని పరీక్షను నిర్వహించగా, ప్రస్తుతం ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న సిలబస్ ఆధారంగానే ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారన్నారు. 2021-22 విద్యా సంవత్సరం ప్రవేశాల్లో భాగంగా ఆగస్టులో నిర్వహించే టీఎస్ ఎడ్సెట్-2021 బీఈడీ ప్రవేశాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తారని తెలిపారు.
బీఈడీ కోర్సులు చదివే వారికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో అనేక అవకాశాలు ఉన్నాయని ఎడ్సెడ్ -2021 కన్వీనర్ ప్రొఫెసర్ రామకృష్ణ తెలిపారు. ఇంటర్నేషనల్ స్కూల్స్, ఆన్లైన్ టీచర్గా, ఈ-లెర్నింగ్ కాన్టెంట్ డెవలపర్స్, ఔత్సాహిక విద్యా, వ్యాపారవేత్తలుగా రాణించేందుకు ఉపయోగపడుతాయని వివరించారు. దీనికి అనుకూలంగా రెండు సంవత్సరాల బీఈడీ కోర్సులను తీసుకొచ్చిందన్నారు. ఎడ్సెట్-2021లో ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థులకు ఇక నుంచి ఒకే ప్రశ్నాపత్రం, ఒకటి నుంచి 10వ తరగతి వరకు తెలంగాణ పాఠ్యాంశాలతో ఉంటుంది. 150 మార్కుల పేపర్లో గణితం 20 మార్కులు, సామాన్యశాస్త్రంలో 20, సాంఘికశాస్త్రంలో 20, టీచింగ్ ఆప్టిట్యూట్లో 20, జనరల్ ఇంగ్లిష్లో 20, జనరల్ నాలెడ్జ్లో విద్యారంగ సమస్యలపై 30, కంప్యూటర్ అవగాహనపై 20 మార్కులతో పేపర్ను రూపొందిస్తారని తెలిపారు.
ప్రశ్నాపత్రాలు తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియాల్లో ఉంటుందని, మోడల్ పేపర్లు, ఇతర వివరాలు edcet.tsche.ac.in. వైబ్సైట్లో పొందుపర్చామన్నారు. పరీక్ష ఫీజు అపరాధ రుసుము జూలై 7వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జనరల్ వారికి రూ.650, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.450 ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. జూలై 15 వరకు అపరాధ రుసుముతో గడువు ఉందని, కంప్యూటర్ పరీక్ష ఆగస్టు 24, 25 తేదీల్లో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందన్నారు. తెలంగాణలో 44 సెంటర్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్, విజయవాడ సెంటర్లలో పరీక్షలు నిర్వహించనునట్లు తెలిపారు. సమావేశంలో కేయూ రిజిస్ట్రార్ డాక్టర్ ఆర్ మల్లికార్జునరెడ్డి, ఎడ్సెట్-2021 కో కన్వీనర్ ప్రొఫెసర్ పారిపల్లి శంకర్ పాల్గొన్నారు.