న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. వరుసగా 52వ రోజు దేశంలో రోజువారీ పాజిటివ్ కేసులకంటే రికవరీలు ఎక్కువగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 43,071 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆదివారం పేర్కొంది. తాజాగా 52,299 మంది బాధితులు కోలుకోగా.. వైరస్ ప్రభావంతో 955 మంది మృత్యువాతపడ్డారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,05,45,433కు పెరిగింది. ఇందులో 2,96,58,078 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్ బారినపడి 4,02,005 మంది రోగులు మృత్యువాతపడ్డారు.
ప్రస్తుతం దేశంలో 4,85,350 యాక్టివ్ కేసులున్నాయని వివరించింది. రికవరీ రేటు 97.09శాతానికి పెరిగిందని మంత్రిత్వ శాఖ చెప్పింది. వ్లీకీ పాజిటివిటీ రేటు ప్రస్తుతం 2.44శాతంగా ఉందని తెలిపింది. మరో వైపు రోజువారీ పాజిటివిటీ రేటు 2.34శాతంగా తగ్గిందని వివరించింది. టీకా డ్రైవ్లో భాగంగా మొత్తం 35,12,21,306 డోసులు అందజేసినట్లు తెలిపింది. మరో వైపు దేశంలో కొవిడ్ పరీక్షలు జోరుగా సాగుతున్నాయి. శనివారం ఒకే రోజు 18,38,490 నమూనాలను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 41,82,54,953 కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు వివరించింది.