గ్రామాల అభివృద్ధికి నెలకు రూ.396 కోట్లు, మున్సిపాలిటీలకు రూ.148కోట్లు
భూపాలపల్లిని సుందరంగా తీర్చిదిద్దాలి
ఉత్తమ వార్డుకు రూ.10 లక్షల నిధులిస్తాం
గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్
కృష్ణకాలనీ/చిట్యాల, జూలై 2 : పల్లె, పట్టణ ప్రగతితో గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా మారుతున్నాయని, పచ్చదనంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం ఆమె జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కారల్మార్క్స్ కాలనీలో, చిట్యాల మండలం ఒడితల, జడల్పేట, చిట్యాల, జూకల్, చల్లగరిగె గ్రామాల్లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్, జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణితో కలిసి మొక్కలు నాటారు. ఒడితల గ్రామంలో పల్లె ప్రగతి, హరితహారంలో ఉత్సాహంగా పాల్గొన్న వారికి బహుమతులు అందజేశారు. అనంతరం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 35 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ.. పట్టణ ప్రగతిలో భాగంగా భూపాలపల్లి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలకు నెలకు రూ.369 కోట్లు, 141 మున్సిపాలిటీలకు నెలకు రూ.148 కోట్లు నిధులు కేటాయిస్తూ అభివృద్ధి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు.
జీపీలు, మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న సిబ్బంది, అంగన్వాడీ టీచర్లకు గతంలో అరకొరగా జీతాలు వచ్చేవని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ వారి జీతాలు పెంచి ప్రతినెలా అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మంజూరైందని, త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. పట్టణ ప్రగతిలో భాగంగా అభివృద్ధి చెందిన వార్డును ఉత్తమ వార్డుగా ఎంపిక చేసి అదనంగా రూ. 10 లక్షల నిధులు ఇప్పిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఎంపీ దయాకర్ మాట్లాడుతూ.. దళిత సాధికారత పథకం దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. సీఎం కేసీఆర్ దళితుల ఆత్మబంధువని, 11 గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం దళితక్రాంతి పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. భూపాలపల్లి మున్సిపాలిటీలో రూ.80 లక్షలతో పట్టణ ప్రగతి పనులు నడుస్తున్నట్లు తెలిపారు. జిల్లా అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషాషేక్, ఆంజనేయ ఆలయ కమిటీ చైర్మన్ కుమార్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్, భూపాలపల్లి ఆర్డీవో శ్రీనివాస్, కమిషనర్ శ్రీనివాస్, తహసీల్దార్ ఇక్బాల్, కౌన్సిలర్లు సజ్జనపు స్వామి, శిరుప అనిల్, జక్కం రవికుమార్, మేకల రజిత, ముంజంపెల్లి మురళీధర్, రవీందర్, శారద, స్వరూపారాణి, మౌనిక, హారిక, నూనె రాజు, నాగవెల్లి సరళ, నాయకులు బుర్ర రమేశ్, బండారి రవి, కటకం జనార్దన్, చిట్యాలలో జడ్పీ సీఈవో శోభారాణి, డీఆర్డీవో పురుషోత్తం, డీపీవో ఆశాలత, ఎంపీపీ వినోద, జడ్పీటీసీ గొర్రె సాగర్, పీఏసీఎస్ చైర్మన్ కుంభం క్రాంతికుమార్రెడ్డి, మండల ప్రత్యేకాధికారి శైలజ, ఎంపీడీవో రవీంద్రనాథ్, సర్పంచులు ఎర్రవెల్లి సాంబలక్ష్మి, రత్నాకర్రెడ్డి, పూర్ణచందర్రావు, మహేందర్, మంజుల పాల్గొన్నారు.
క్రీడాస్ఫూర్తిని చాటాలి
జయశంకర్ భూపాలపల్లి, జూలై 2 (నమస్తే తెలంగాణ): టోక్యోలో ఈ నెల 23 నుంచి జరుగనున్న ఒలింపిక్స్ క్రీడల్లో దేశం తరఫున పాల్గొంటున్న క్రీడాకారులకు మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా యూత్, స్పోర్ట్స్ అధికారి బుర్ర సునీత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్’ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ఒలింపిక్స్లో క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి దేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి, క్రీడాకారులు పాల్గొన్నారు.