రంగారెడ్డి, జూన్ 22, (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చెందడంతో పాటు పచ్చని చెట్లతో హరిత శోభను సంతరించుకున్నాయి. రోడ్లకు ఇరువైపులా మొక్కలు దర్శనమిస్తుండడంతో పాటు పారిశుధ్యం పక్కాగా జరుగుతున్నది. ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను వేరు చేసి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అంత్యక్రియల కోసం ప్రతి గ్రామంలో వైకుంఠధామాన్ని నిర్మించారు. ప్రత్యేక వాకింగ్ ట్రాక్, వివిధ రకాల మొక్కలతో పల్లెప్రకృతి వనాలనూ ఏర్పాటు చేశారు. పురాతన ఇండ్లు, శిథిల భవనాలు, కూల్చడంతోపాటు పడావుపడ్డ బావులను పూడ్చివేశారు. కలుపుమొక్కలను తొలగించి పల్లెలంతా పరిశుభ్రంగా ఉండేలా చూస్తున్నారు. డ్రైనేజీలు, మురుగు కాలువలను శుభ్రం చేసి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి నెలా రంగారెడ్డి జిల్లాలోని 558 గ్రామపంచాయతీలకు రూ.18 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేస్తున్నది.
వచ్చేనెల ఒకటి నుంచి మూడో విడుత..
జూలై ఒకటో తేదీ నుంచి మూడో విడుత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపట్టనున్నారు. పది రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమాలకు ప్రభుత్వం జిల్లాకు రూ.25 లక్షలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా పురాతన ఇండ్లు, శిథిల భవనాలను తొలగించడం, నిరుపయోగంగా ఉన్న బావులను పూడ్చివేయనున్నారు. గ్రామాల్లో కలుపు మొక్కలను తొలగించడం, డ్రైనేజీలు, మురుగు కాల్వలను శుభ్రం చేయనున్నారు.
రెండు విడుతల్లో పూర్తైన పనులు..
జిల్లాలోని 558 గ్రామ పంచాయతీలతోపాటు 309 హబిటేషన్లలోనూ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. ఎకరా స్థలంలో 4 వేల మొక్కలను నాటడంతో పాటు వాకింగ్ ట్రాక్ల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.9 లక్షలను ఖర్చు చేసింది. పల్లె ప్రకృతి వనాల్లో పొడువు జాతి, చిన్న జాతి మొక్కలతోపాటు ఔషధ మొక్కలను నాటారు. పల్లెప్రకృతి వనాల్లో వేప, ఇప్పా, నెరపి, గంధం, టేకు, పొంగామియా, కుంకుడు, ఉసిరి, మారేడు, చింత, పనస, అండుగ, సీమచింత, మెహందీ, సీతాఫల్, జామ, దానిమ్మ, కరివేప, నిమ్మ, తాటిచెట్టు, మల్బరీ, వెదురు, జమ్మి, వావిల్లి మొక్కలను నాటారు. ప్రతి పంచాయతీకి కేటాయించిన 10 శాతం గ్రీన్ బడ్జెట్ను ఖర్చు చేశారు. ప్రతి గ్రామపంచాయతీకి ట్రాక్టర్తోపాటు ట్రాలీ, ట్యాంకర్నూ అందజేశారు. నిత్యం చెత్తను సేకరించి, డంపింగ్ యార్డుకు తరలించడంతో పాటు ట్యాంకర్లతో మొక్కలకు నీళ్లు పోశారు. గ్రామపంచాయతీ సిబ్బందిలోనే ఒకరు ట్రాక్టర్ డ్రైవర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలోని 557 గ్రామపంచాయతీల్లో డంపింగ్ యార్డులు పూర్తి కాగా, ఒక్కోదానికి రూ.6 లక్షలు ఖర్చు చేశారు. జిల్లాలోని 511 పంచాయతీల్లో వైకుంఠధామాల నిర్మాణం పూర్తికాగా, మిగతావి త్వరగా పూర్తయ్యేలా అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా నర్సరీలను ఏర్పాటు చేసి హరిహారాకి మ్కొలను సిద్ధం చేశారు.
వికారాబాద్ జిల్లాలో..
పరిగి, జూన్ 22 : వికారాబాద్ జిల్లాలో వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నాలుగు మున్సిపాలిటీలు, 566 గ్రామపంచాయతీలు ఉన్నాయి. మూడో విడుత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని జూలై ఒకటి నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు. గతంలో మాదిరిగా పారిశుధ్యం, ఇతర కార్యక్రమాలకు పెద్ద పీట వేయనున్నారు. వికారాబాద్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు ప్రతినెలా రూ.కోటి 58లక్షలు కేటాయిస్తారు. ఇందులో వికారాబాద్ మున్సిపాలిటీకి రూ.64.97లక్షలు, తాండూరు మున్సిపాలిటీకి రూ.60లక్షలు, పరిగి మున్సిపాలిటీకి రూ.17లక్షలు, కొడంగల్ మున్సిపాలిటీకి రూ.16.78లక్షలు విడుదల చేస్తారు. ఇటీవల నాలుగు మున్సిపాలిటీలకు ఏప్రిల్, మే నెలకు సంబంధించిన గ్రాంటు విడుదల చేశారు. జిల్లాకు ప్రతినెలా సుమారు రూ.7కోట్లకు పైగా నిధులు అందనున్నాయి.
జిల్లాలో కోటి మొక్కల పెంపకం…
జిల్లా పరిధిలో ఈసారి సుమారు కోటి మొక్కల పెంపకానికి అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. ఇందులో 22 ప్రభుత్వ శాఖల ద్వారా 42లక్షల మొక్కలు, 566 గ్రామపంచాయతీలకు సంబంధించి, ప్రతి గ్రామపంచాయతీలో 10వేల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నారు. జూలై నెల ప్రారంభం నాటికి వర్షాలు మరింత కురియనున్నాయి. ఇప్పటికే ఆయా మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కల పెంపకం చేపట్టారు. మరోవైపు ఈసారి రోడ్లకు ఇరువైపులా రెండుమూడు వరుసల్లో మొక్కలు నాటాలని ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశించారు. వికారాబాద్ జిల్లా పరిధిలో 42 కిలోమీటర్లు రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రోడ్లు 467 కిలోమీటర్లు, 443 కిలోమీటర్లు గ్రామీణ రోడ్లు ఉన్నాయి. ఎవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా ఆయా రోడ్లకు ఇరువైపుల రెండుమూడు వరుసలలో మొక్కల పెంచనున్నారు.
రూ.25లక్షలు విడుదల…
జూలై ఒకటో తేదీ నుంచి పది రోజులపాటు కొనసాగే పల్లె ప్రగతి కార్యక్రమం కోసం ప్రభుత్వం జిల్లాకు రూ.25లక్షలు విడుదల చేసింది. పది రోజులపాటు ప్రకృతివనాలు, పారిశుధ్యం, మొక్కలు నాటడం, చెత్త సేకరణ, ప్రతి ఊరిలో ట్రై సైకిళ్లు ఇవ్వడం, నిరుపయోగంగా ఉన్న బావులను పూడ్చివేయడం వంటి పనులను చేపట్టనున్నారు.