సిటీబ్యూరో, జూన్ 20 (నమస్తే తెలంగాణ): నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు యోగాపై ఆన్లైన్ క్విజ్పోటీలను సోమవారం నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా విద్యాధికారి రోహిణి ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. యోగా ప్రాముఖ్యత, ఆరోగ్య సంరక్షణ తదితర అంశాలపై ప్రధానంగా ప్రశ్నలు ఉంటాయని, పోటీలు జూన్ 21 నుంచి జూలై 20వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపారు. పోటీలో పాల్గొనేందుకు 6 నుంచి 12వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులు అర్హులని స్పష్టం చేశారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు దీక్ష పోర్టల్లో పేర్లు నమోదు చేసుకోవాలని వివరించారు. అదేవిధంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 6-8వ తరగతి వరకు 100 మంది, 9-12వ తరగతి వరకు 100 మంది విద్యార్థులతో పాటు 100 మంది ఉపాధ్యాయులకు మెరిట్ సర్టిఫికెట్లను కూడా అందజేస్తారని తెలిపారు. వివరాలకు జిల్లా సైన్స్ అధికారి ధర్మేందర్రావు, ఫోన్: 77991 71277 లో సంప్రదించాలని సూచించారు.