న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతానికి కరోనా మహమ్మారి ప్రభావం తగ్గినా వేగవంతమైన, పూర్తిస్థాయి వ్యాక్సినేషన్ అవసరమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. భారతీయ జనతాపార్టీ మార్కు ప్రాస నినాదాలు, అవాస్తవ ప్రచారాలు అవసరం లేదని ఆయన ట్వీట్ చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తగినన్ని టీకా డోసులను సరఫరా చేయడంలో భారత ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
కరోనా విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలవల్ల టీకాల కొరత ఏర్నడిందని రాహుల్గాంధీ ఆరోపించారు. మోదీ ప్రతిష్ఠను కాపాడేందుకు ప్రభుత్వ వర్గాలు చేస్తున్న ప్రయత్నాలన్నీ వైరస్ వ్యాప్తిని పెంచడానికి దోహదపడుతున్నాయని, తద్వారా అధిక సంఖ్యలో ప్రజలు కొవిడ్ మహమ్మారికి బలవుతున్నారని ధ్వజమెత్తారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య సమయాన్ని ఎలాంటి శాస్త్రీయ ఒప్పందం లేకుండానే పెంచాలని ప్రభుత్వం సిఫారసు చేసినట్లు తెలుపుతున్న వార్తా కథనాన్ని ఆయన ట్విట్టర్లో పోస్టు చేశారు.