హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): కమ్యునిస్టు భావజాలం నుంచి నాయకుడిగా వచ్చానని చెప్పుకొనే ఈటల.. ఇప్పుడు తన అభిమానాన్ని కాషాయ భావజాలానికి తాకట్టు పెట్టారని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయభాస్కర్ అన్నారు. ఆయనది అస్థిత్వ పోరాటమే కానీ, ఆత్మగౌరవ పోరాటం కాదని చెప్పారు. పెట్రోల్, డీజీల్, వంటగ్యాస్ ధరలు పెంచటం న్యాయమని ఆమోదించేందుకు, దేశ ప్రజల ఆరోగ్యాన్ని పక్కనబెట్టి విదేశాలకు వ్యాక్సిన్ అమ్ముకున్నందుకు, కేంద్రం తెచ్చిన వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ 240 మంది రైతులు ప్రాణాలు కోల్పోయినందుకు బీజేపీలో చేరారా అనేది ఈటల స్పష్టంచేయాలని నిలదీశారు. గ్రామానికో తరుణ్చుగ్లు వచ్చినా టీఆర్ఎస్కు, ముఖ్యమంత్రి కేసీఆర్కున్న ప్రజాబలం చెక్కుచెదరదని పేర్కొన్నారు. మంగళవారం టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో వినయ్భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈటల బీజేపీలో ఎందుకు చేరారో సమాధానం చెప్పాలని డిమాండ్చేశారు. కాళేశ్వరానికి జాతీయ హోదా, విభజన చట్టంలో హామీఇచ్చిన కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీపై డిమాండ్ చేస్తూ.. వాటిపై హామీ తీసుకున్నాక ఆ పార్టీలో చేరితే తెలంగాణవాదులు కొంతయినా సంతోషపడేవారని, కానీ తనకోసం, తన ఆస్తుల రక్షణ కోసమే చేరారని తేలిపోయిందని చెప్పారు.
టీఆర్ఎస్లో, ప్రభుత్వంలో అత్యంత విలువ, గౌరవం ఇచ్చిన సీఎం కేసీఆర్ను నియంతగా పేర్కొనటం ఈటల భావదారిద్య్రానికి నిదర్శమని వినయ్భాస్కర్ మండిపడ్డారు. స్వార్థం కోసం కొత్త ఓనర్ను వెతుక్కున్నారని ఎద్దేశాచేశారు. వందేండ్ల భవిష్యత్ ఉన్న టీఆర్ఎస్ వెంటే ఉంటాం.. కానీ, వాడిపోయే కమలం వెంట ఉండబోమని హుజూరాబాద్ ప్రజలు, ప్రజాప్రతినిధులు తేల్చి చెప్తున్నారని అన్నారు. టీఆర్ఎస్తో విభేదించి, సీఎం కేసీఆర్ను నిందించిన ఎంతోమంది కనుమరుగయ్యారని, రేపు ఈటల పరిస్థితి కూడా అదే అవుతుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో భూముల వేలాన్ని అడ్డుకుంటామని కాంగ్రెస్ నేతలు మాట్లాడటం సిగ్గుచేటని దాస్యం అన్నారు. ఆ పార్టీ హయాంలోనే ప్రభుత్వ ఆస్తుల అమ్మకం మొదలైందన్న సంగతి ప్రజలు మరచిపోరని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న శత్రువు బీజేపీ అని, అలాంటి శత్రువుతో ఈటల చేతులు కలిపారని ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. తెలంగాణపై అయిష్టతతోనే ఈటల బీజేపీలో చేరారనే అనుమానం వస్తున్నదని పేర్కొన్నారు.