న్యూఢిల్లీ, జూన్ 12: చిన్నారుల్లో సాధారణంగా వేసే డీటీపీ, ఎంఎంఆర్ తదితర వ్యాక్సిన్ల ఇమ్యునైజేషన్ కార్యక్రమం కరోనా కారణంగా కుంటుపడిందని, ఇది భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలకు దారి తీయవచ్చని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా ప్రారంభమై నప్పటి నుంచీ ముఖ్యంగా సెకండ్వేవ్ ఉద్ధృతంగా ఉన్న సమయంలో అనేకమంది తల్లిదండ్రులు తమ చిన్నారులను డీటీపీ, ఎంఎంఆర్ వంటి తప్పనిసరి టీకాలు వేయించటానికి కూడా దవాఖానలకు తీసుకురాలేదు. కరోనా సోకుతుందన్న భయంతో వారు అలాగే ఉండిపోయారు. అయితే, పిల్లలకు సరైన సమయంలో ఈ టీకాలను వేయించకపోతే.. వారు పెరిగే క్రమంలో ఆ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుందని పలువురు వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా దీనిపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.