సీఎం కృషి వల్లే ఎండకాలంలో కాళేశ్వరం జలాలు
మెట్టప్రాంతమైన సిరిసిల్లలో అంచనాలకు మించి దిగుబడులు
పంటలను కాపాడిన సీఎంకు అన్నదాతల ఆశీర్వాదం
ఆధునిక వ్యవసాయ మార్కెట్ యార్డును 11న ప్రారంభిస్తాం
రైతుబంధు అర్హులందరికీ అందేలా చూడాలి
వారంలోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి
తరలింపులో ఎదురయ్యే సమస్యలను అధిగమించాలి
సిరిసిల్లలో ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్
రాజన్న సిరిసిల్ల, జూన్ 2 (నమస్తే తెలంగాణ)/ సిరిసిల్ల/సిరిసిల్ల రూరల్/ కలెక్టరేట్: దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం పనిచేస్తున్నారని, రైతులకు అసలు సిసలైన రైతు‘బంధువు’ కేసీఆర్ అని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్శాఖల మంత్రి కేటీఆర్ కొనియాడారు. వేల ఎకరాల్లో పంట ఎండిపోతుందనుకున్న వేళ గోదావరి జలాలతో కాపాడిన ముఖ్యమంత్రికి అన్నదాతలంతా రెండుచేతులతో ఆశీర్వదిస్తున్నారని వ్యాఖ్యానించారు. సీఎం రెండో హరిత విప్లవానికి నాంది పలికారని చెప్పారు. ఒకప్పుడు కరువుతో అల్లాడిన సిరిసిల్ల ప్రాంతమంతా కాళేశ్వర జలాలతో నేడు సస్యశ్యామలమైందని సంతోషం వ్యక్తం చేశారు. నడి ఎండాకాలంలో ఎగువ మానేరు, చెరువులు కుంటలు మత్తళ్లు దూకిన సజీవదృశ్యాలు చూసిన రైతుల హృదయాలు పులికించిపోయాయని పేర్కొన్నారు. అంచనాలకు మించి బంపర్ దిగుబడితో తెలంగాణ ధాన్యాగారంగా మారిందని, దీన్ని చూసి దేశమే హర్షిస్తున్నదని తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బుధవారం ఉదయం 9గంటలకు సిరిసిల్లకు వచ్చిన ఆయన, ముందుగా పాతబస్టాండ్లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షించారు. 11.20గంటలకు 17వ పోలీస్ బెటాలియన్ను సందర్శించి, కమాండ్ కంట్రోల్ భవనం, బెల్ ఆఫ్ ఆర్మ్స్ను, గార్డ్ గదిని పరిశీలించారు. బెటాలియన్ కమాండెంట్ టీ అలెక్స్ అభివృద్ధి పనుల గురించి వివరించారు. అనంతరం మంత్రి అక్కడి మైదానంలో మొక్కలు నాటి, ఆ పక్కనే 22 కోట్లతో నూతనంగా నిర్మించిన అధునాతన వ్యవసాయ మార్కెట్ యార్డును పరిశీలించారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రాంగణమంతా కలియదిరిగి, మాట్లాడారు. సీఎం కేసీఆర్ కృషితోనే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాళేశ్వర జలాలతో నడి ఎండల్లో ఎగువమానేరు పరవళ్లను చూశామని గుర్తు చేశారు. జిల్లాలో వ్యవసాయ సాగు విస్తీర్ణం పెరిగిందని, నాడు సాగునీరు లేక బీళ్లుగా మారిన పొలాలు నేడు పంటలతో సస్యశ్యామలమవుతున్నాయని అన్నారు. జిల్లాలో 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందనుకుంటే 3.10లక్షల మెట్రిక్ టన్నులు సేకరిస్తున్నామని, ఎక్కడ చూసినా ధాన్యపు రాశులే దర్శనమిస్తున్నాయని సంతోషంగా చెప్పారు. రైతుబంధు పెట్టుబడి జమయ్యేలోపు భూ సమస్యలుంటే పరిష్కరించుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. 15 నుంచి రైతుబంధు నగదు ఖాతాల్లో జమవుతుందని, అర్హులందరికీ పెట్టుబడి అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అటవీ భూముల సమస్యను పరిష్కరించాలని కలెక్టర్కు సూచించారు.
ఎగువమానేరు నీటితో భారీ దిగుబడి
జిల్లాలో 2.5 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందనుకుంటే 3.1 లక్షల టన్నులు సేకరిస్తున్నామని, ఎక్కడ చూసినా ధాన్యపురాశులే దర్శనమివ్వడం సంతోషంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ చెప్పారు. కాళేశ్వర జలాలతో నర్మాల ఎగువమానేరును నింపడంతో జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగిందని, అధిక దిగుబడితో ఒక్కో రైతు 30 నుంచి 35 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి సాధించడం గొప్ప విషయమన్నారు. వారంలోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేయాలని, ఇసుక రవాణాను నిలిపివేసి ఆ వాహనాలను ధాన్యం తరలించేందుకు వినియోగించాలని సూచించారు. ధాన్యం మిల్లులకు తరలించేందుకు వాహనాల కొరతపై అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా పైవిధంగా స్పందించారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యే వరకు ఇసుక రవాణా నిలిపివేయాలని ఎస్పీ రాహుల్ హెగ్డేను ఆదేశించారు.
11న మార్కెట్ యార్డు ప్రారంభం..
రైతుల శ్రేయస్సును కాంక్షించి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 22 కోట్లతో సిరిసిల్లలో అధునాతన వ్యవసాయ మార్కెట్ యార్డును 20 ఎకరాల్లో నిర్మించామని, 11న వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డితో కలిసి ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. అధునాతన మార్కెట్యార్డును మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎస్పీ రాహుల్హెగ్డే, 17వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ అలెక్స్, అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, రైతు బంధు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ సింగిరెడ్డి రవీందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, ఆర్డీవో శ్రీనివాసరావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చీటి నర్సింగరావు, చిక్కాల రామారావు, గూడూరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.