సిద్దిపేట: అమరుల త్యాగాలు, ప్రజా పోరాటాలు ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ కోసం పదవులతోపాటు కేసీఆర్ తన ప్రాణాలను కూడా పణంగా పెట్టారని చెప్పారు. రాష్ట్ర ఎనిమిదో అవతరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట కలెక్టరేట్లో మంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఉద్యమ నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో ఢిల్లీని కదిలించి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. ఎన్నో ఆశలతో ఏర్పడిన రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నదని వెల్లడించారు.
సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా, దేశానికే రోల్మోడల్గా తీర్చిద్దుకున్నామని చెప్పారు. 70 ఎండ్లలో జరగని పనులను ఏండేండ్లలో పూర్తిచేశామన్నారు. సిద్దిపేట జిల్లా ఏర్పాటు అనేది ఈ ప్రాంత ప్రజల నాలుగు దశాబ్దాల కల అని, దానిని సీఎం ఆశీస్సులతో నెరవేర్చుకున్నామని తెలిపారు. నాడు ఉద్యమానికి దిక్సూచిలా ఉన్న సిద్దిపేట నేడు అభివృద్ధికి మారుపేరుగా మారిందన్నారు. ఆలయాల జిల్లా, జలాశయాల ఖిల్లాగా సిద్దిపేట నేడు చరిత్ర పుటల్లో నిలిచిందని పేర్కొన్నారు.
ఒకప్పుడు గుక్కెడు నీళ్ల కోసం తపించిన జిల్లా.. ఆకలి చావులు, ఆత్మహత్యలు, అంబలి కేంద్రాలకు చిరునామా ఉన్న సిద్దిపేట జిల్లా నేడు పసిడి పంటలు, ధాన్యపు సిరులకు నిలయంగా ప్రసిద్ధి పొందిందన్నారు. మండుటెండల్లో జిల్లాలోని వాగులు, వంకలు గోదావరి నీటితో జలకలను సంతరించు కున్నాయని ఆనందం వ్యక్తంచేశారు. జూన్ రెండో వారంలో కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్లను సీఎం చేతుల మీదుగా ప్రారంభమవుతాయని చెప్పారు.
వానాకాలం నుంచే మల్లన్న సాగర్ జలాశయం ఫలితాలు అందేలా చూస్తున్నామని తెలిపారు. సిద్దిపేట జిల్లాలో పంట కాలువలు, పిల్ల కాలువల నిర్మాణానికి రైతులు ఉద్యమ స్ఫూర్తితో స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాలను తలదన్నేలా సిద్దిపేట జిల్లా ఆవిర్భవిస్తుందన్నారు. కరువు జిల్లాను స్వరాష్ట్రంలో కల్ప తరువు జిల్లాగా తీర్చిదిద్దామని చెప్పారు. సంక్షేమంలోనూ సిద్దిపేట మొదటి స్థానంలో ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పింఛన్ల కింద జిల్లాలో రూ.36 లక్షలు ఖర్చు చేస్తే, నేడు దానికి వంద రెట్లు పంచి రూ.37 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. రైతులకు వెన్ను దన్నుగా ఉండేందుకు రైతు బంధు, రైతు బీమా పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.