మియాపూర్, మే 30: కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. కరోనాను తొలి దశలోనే గుర్తించేందుకు ఇంటింటి జ్వర సర్వేను చేపడుతూనే మరోవైపు ప్రత్యేక వ్యాక్సిన్ కేంద్రాల ద్వారా ఆయా వర్గాలకు టీకా వేస్తున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్నగర్ డివిజన్ పరిధిలోని హెచ్ఎంటీ హిల్స్ కమ్యూనిటీ హాల్లో సూపర్ స్ప్రెడర్ల వ్యాక్సినేషన్ కేంద్రాన్ని కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత, డీసీ ప్రశాంతి, వైద్యాధికారి చంద్రశేఖర్రెడ్డి, కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, దొడ్ల వెంకటేశ్ గౌడ్తో కలిసి విప్ గాంధీ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయా వర్గాలను సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించి ప్రత్యేక కేంద్రాల ద్వారా వ్యాక్సిన్ను అందిస్తున్నదని, ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిజమైన సూపర్ స్ప్రెడర్లకే వ్యాక్సిన్ అందేలా చూడాలని, వ్యాక్సిన్ కేంద్రంలో కొవిడ్ నిబంధలను పక్కాగా పాటిస్తూ వ్యాక్సినేషన్ను కొనసాగించాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న ఇంటింటి జ్వర సర్వేతో మంచి ఫలితాలు వస్తున్నాయని.. ఇంటి వద్దే బాధితులను గుర్తించి మందులు అందిస్తున్నారు. వ్యాక్సినేషన్ కేంద్రాల్లో లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని విప్ గాంధీ సూచించారు. ఈ కార్యక్రమంలో కాశీనాథ్యాదవ్, పోతుల రాజేందర్, పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.