అనంతగిరిలో సండే సందడి

వికారాబాద్: జిల్లా కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో అనంతగిరి కొండలు ఉన్నాయి. ఈ కొండల మధ్య శ్రీ అనంతపద్మనాభ స్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు, పర్యాటకులు ప్రతి శని, ఆదివారాల్లో పెద్ద సంఖ్యలో వస్తుంటారు. హైదరాబాద్, మహబూబ్నగర్, సంగారెడ్డి ప్రాంతాల నుంచి పర్యాటకులు, భక్తులు పెద్దసంఖ్యలో ఆదివారం వచ్చారు. భక్తులు ముందుగా అనంతపద్మనాభస్వామి దేవాలయం సమీపంలో ఉన్న కోనేటిలో పుణ్యస్నానాలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు.
ఆలయ అర్చకులు శేషగిరిపంతులు భక్తులకు అభిషేకం చేశారు. అనంతరం భక్తులు అనంతగిరిలో వ్యూ పాయింట్ల వద్ద అనంతగిరి అందాలను వీక్షించారు. అక్కడి నుంచి ఘాట్ రోడ్డులో ఉన్న నంది విగ్రహం వద్ద పర్యాటకులు పెద్దసంఖ్యలో సెల్ఫీలు దిగారు. యువత అనంతగిరి అటవీ ప్రాంతంలోకి వెళ్లి ఫారెస్ట్ను చూశారు. భక్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు అనంతగిరి అటవీలో ఆనందంగా గడిపారు. పర్యాటకులు వనభోజనాలు, వివిధ రకాల ఆటలతో సంతోషంగా గడిపారు.