నల్లగొండ ప్రతినిధి, నమస్తే తెలగాణ మే 21 : లాక్డౌన్తో కేసులు తగ్గుముఖం పట్టాయని ముఖ్యమంత్రి కేసీఆర్కు నల్లగొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వివరించారు. కరోనా నియంత్రణ, లాక్డౌన్ అమలు, యాసంగి ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ శుక్రవారం వరంగల్ అర్బన్ కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్, వైద్యారోగ్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించారు. ఈ సందర్భంగా పీజే పాటిల్ మాట్లాడుతూ.. లాక్డౌన్తో కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయని, జిల్లాలో 30 శాతం నుంచి 18 శాతానికి తగ్గినట్లు తెలిపారు. లాక్డౌన్ జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే డీఐజీ ఏవీ రంగనాథ్తో కలిసి మండల అధికారులు, పోలీస్, సర్పంచ్లతో కరోనా నియంత్రణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు వివరించారు. గ్రామస్థాయిలోనే ఐసొలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. ఆంధ్రా సరిహద్దు ప్రాంతంలో కేసులు ఎక్కువగా వస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులతోపాటుప్రైవేట్ ఆస్పత్రుల్లో సమావేశాలు జరిపి కొవిడ్ రోగులకు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు వైద్యసేవలు, చికిత్స అందించేందుకు ఆదేశాలు ఇచ్చామన్నారు. జిల్లాలో పడకలు, ఆక్సిజన్, మందులకు కొరత లేదని, జ్వర సర్వే పూర్తి చేసి లక్షణాలు ఉన్న వారికి మెడికల్ కిట్లు అందజేసినట్లు చెప్పారు. లాక్డౌన్ సమయంలో ప్రజలు బయటకు రాకుండా అవగాహన కల్పిస్తున్నామని, అత్యవసర పరిస్థితుల్లో దరఖాస్తు చేసుకున్న వారికి పాస్లు మంజూరు చేశామని, జిల్లాలో లాక్డౌన్ ప్రక్రియ పక్కగా అమలవుతుందని వివరించారు. రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఐజీ ఏవీ రంగనాథ్, జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డా॥ కొండల్రావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.