25 గంటల పాటు నిరీక్షణ
ఎట్టకేలకు కొవిడ్ బాధితురాలు రిమ్స్కు తరలింపు
బాధితురాలి కుటుంబసభ్యులకు డాక్టర్ శిల్ప కౌన్సెలింగ్..
ఎదులాపురం,మే 20 : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వే సత్ఫలితాలనిస్తున్నది. ఇందుకు ఆదిలాబాద్ పట్టణంలోని ఓ బాధితురాలిని దవాఖానకు తరలించడమే ఇందుకు నిదర్శనం. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని రిక్షాకాలనీలో వృద్ధురాలికి 5 రోజుల కిత్రం పాజిటివ్ వచ్చింది. కుటుంబ సభ్యులు ఆమెకు పట్టణంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స చేయించారు. ఖుర్షీద్నగర్ పీహెచ్సీ మెడికల్ సిబ్బంది ఇంటింటా సర్వే చేస్తున్న క్రమంలో వృద్ధురాలు ఇంట్లో ఆక్సిజన్ పెట్టుకొని ఉండడంతో గమనించిన ఆశ వర్కర్ అనిత వెంటనే ఏఎన్ఎంకు పుష్పలతకు సమాచారం ఇచ్చింది. బుధవారం ఆక్సిజన్ అయిపోవడంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడింది.గురువారం తిరిగి సర్వే చేయడానికి వెళ్లిన ఆశ వర్కర్ ,ఏఎన్ఎం ఆమెను రిమ్స్కు వెళ్లాలని కోరారు. తాను ఎక్కడికి వెళ్లనని తేల్చి చెప్పింది. దీంతో ఏమి చేయాలో తెలియక ఖుర్షీద్నగర్ వైద్యాధికారి శిల్పకు ఈ విషయం తెలియజేయగా ఆమె వెంటనే అక్కడికి చేరుకున్నారు. వృద్ధురాలి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ చేశారు. ఇంటి ముందుకు అంబులెన్స్ వచ్చినా వెళ్లనంటూ మొండికేసింది. వైద్యాధికారి శిల్ప సుమారు 25 గంటల పాటు ఆ కుటుంబానికి కౌన్సెలింగ్ ఇచ్చింది. ఎట్టకేలకు రిమ్స్కు ఆ వృద్ధురాలిని తరలించారు. ప్రసుత్తం ఆమె కొవిడ్ వార్డులో చికిత్సపొందుతున్నది. ఈ విషయన్ని తెలుసుకున్న డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ డాక్టర్ శిల్ప, ఆశ వర్కర్ అనిత, ఏఎన్ఎం పుష్పలత, సీవో ప్రశాంత్దేశ్పాండేను అభినందించారు.
కేసులు బయటపడుతున్నాయి
ఇంటింటా సర్వేతో కుటుంబంలో ఎవరికి కొవిడ్ లక్షణాలు ఉన్నాయి, వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారనే విషయాలు వెల్లడవుతున్నాయి.ఆరోగ్య వివరాలు తెలుసుకుంటూ వారికి కావాల్సిన వైద్యం ముందే తెలుసుకునే అవకాశం ఉంది. ప్రతి వెయ్యిమందికో టీమ్ పని చేస్తుంది. ఇలాంటి సంఘటనలు ఉంటే వెంటనే సంబంధిత మెడికల్ ఆఫీసర్కు తెలియజేయాలి.
నరేందర్ రాథోడ్, డీఎంహెచ్వో