వికారాబాద్, మే 20, (నమస్తే తెలంగాణ): కొవిడ్ కష్టకాలంలో రాష్ట్ర సర్కార్ గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులను సమకూర్చింది. ఈ నెలలో వికారాబాద్ జిల్లాకు ఎస్ఎఫ్సీ నిధులు రూ.10కోట్లు విడుదల చేసింది. ఈ నిధులను అధికారులు కొన్ని రోజులుగా ఆయా గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేస్తున్నారు. కాగా, జిల్లాలో మొత్తం 566 గ్రామ పంచాయతీలుండగా.. 9లక్షల పైగా జనాభా ఉన్నది. ఈ నిధుల్లో సాధారణ, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఉన్నాయి. గ్రామాల అభివృద్ధికి ఈ నిధులు ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయి. కరోనా మహమ్మారి వెంటాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పారిశుధ్య చర్యలు అత్యవసరంగా మారాయి. తాగునీరు, పారిశుధ్య నిర్వహణ, వీధి లైట్లు తదితర అంశాలకు ప్రాధాన్యమిస్తూ ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు వీలు కలుగుతున్నది. పాలక వర్గాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.