ముంబై, మే 19: తౌటే తుఫాన్ ధాటికి సోమవారం బాంబే హై తీరంలో కొట్టుకుపోయిన పీ-305 నౌకలో 26 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. 49 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. వారి కోసం నేవీ, కోస్ట్గార్డ్ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. పీ-305 నౌక నుంచి ఇప్పటివరకు 186 మందిని రక్షించారు. ఈ నౌకలో మొత్తం 261 మంది ఉన్నట్టు తెలిపారు. సోమవారం మొత్తం మూడు బార్జిలు (భారీ నౌకలు), ఒక ఆయిల్ రిగ్ కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. పీ305 మునిగిపోగా గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. మిగతా నౌకల్లోని సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. కాగా, సముద్రంలో 7 గంటలపాటు ఈత కొట్టి ప్రాణాలతో బయటపడినట్టు మనోజ్ అనే కార్మికుడు తెలిపారు.
తౌటే తుఫాన్ కారణంగా గుజరాత్లో మృతిచెందిన వారి సంఖ్య 46కి పెరిగింది. రాష్ర్టానికి తక్షణసాయంగా ప్రధాని మోదీ వెయ్యి కోట్లను ప్రకటించారు. బుధవారం గుజరాత్, డామన్ డయ్యూలలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని ఏరియల్ సర్వే నిర్వహించారు.
పశ్చిమతీరంలో తౌటే తుఫాన్ సృష్టించిన విలయాన్ని మరువకముందే తూర్పు తీరాన్ని వణికించేందుకు మరో తుఫాన్ సిద్ధమవుతున్నది. బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడవచ్చని, ఈ నెల 27న అది బెంగాల్, ఒడిశా తీరాన్ని తాకవచ్చని ఐఎండీ వెల్లడించింది. అయితే ఇది తౌట్ తుఫాన్ అంత తీవ్రంగా ఉండదని తెలిపింది. ఈ తుఫాన్కు యాస్ అని నామకరణం చేశారు.