థర్డ్వేవ్ను ఎదుర్కొనాలంటే వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచాలి
ఐఎంఏ అధ్యక్షుడు జయలాల్
న్యూఢిల్లీ, మే 19: దేశంలో థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదమున్నదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) హెచ్చరించింది. దీనిని ఎదుర్కోవటానికి మన ముందున్న ఏకైక మార్గం పెద్ద ఎత్తున టీకాలు వేయటమేనని (వ్యాక్సినేషన్) తెలిపింది. సామూహిక వ్యాక్సినేషన్ చేపట్టాలని కేంద్రానికి సూచించింది. లేకపోతే థర్డ్వేవ్ను ఎదుర్కొనడం కష్టమని తెలిపింది. సాధ్యమైనన్ని ఎక్కువ వ్యాక్సిన్లను కొనుగోలు చేయాలని కోరింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వికేంద్రీకరించాలని, ఇంటింటికి వెళ్లి టీకాలు వేసే స్థాయికి తీసుకెళ్లాలని పేర్కొన్నది. అలాగే వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచాలని ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ జేఏ జయలాల్ సూచించారు. వచ్చే కొన్ని నెలల్లో దేశ జనాభాలో 60-70 శాతానికి వ్యాక్సినేషన్ వేసే లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పారు. కరోనా నుంచి కోలుకున్న రోగులు 6 నెలల వ్యవధి తర్వాత టీకా తీసుకోవాలన్న ప్రతిపాదనపై ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. సుదీర్ఘ విరామం వల్ల వారు మళ్లీ వైరస్ బారినపడే ప్రమాదమున్నదని తెలిపారు. దేశాన్ని కొవిడ్ రహితంగా మార్చాలంటే, దీనిపై పునరాలోచించుకొని వీలైనంత త్వరగా ప్రజలకు టీకాలు వేయాలన్నారు.