న్యూఢిల్లీ: కరోనా వల్ల తల్లి, సోదరిని కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న భారత మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తిని బీసీసీఐ పట్టించుకోలేదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ లీసా స్తాలేకర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అపార వేదనలో ఉన్న వేద ఎలా ఉందో కూడా బీసీసీఐ ఆరాతీయలేదని చెప్పింది. అలాగే ఇంగ్లండ్ పర్యటన కోసం పక్కనపెట్టిన సమయంలోనూ ఆమె ను సంప్రదించలేదని లీసా శనివారం ట్వీట్ చేసింది. ‘రానున్న ఇంగ్లండ్ పర్యటనకు వేదను ఎంపిక చేయకపోవడం బీసీసీఐ దృష్టిలో సరైనదే అనిపించవచ్చు. ఆమె కాంట్రాక్టు పరిధిలోని ప్లేయర్. అయినా బీసీసీఐ కనీసం వేదను సంప్రదించలేదు. అసలు ఆమె ఎలా ఉందో కూడా పట్టించుకోలేదు. ప్రస్తుత మహమ్మారి సమయంలో చాలా మంది ప్లేయర్లు బాధ, భయం, ఒత్తిడికి గురవుతున్నారు. బోర్డులు ఆటనే కాకుండా ప్లేయర్ల సంక్షేమం గురించి కూడా పట్టించుకోవాలి. చాలా నిరుత్సాహపడ్డా’ అని స్తాలేకర్ పేర్కొంది.