తగ్గని మాసాబ్ చెరువు వరద ఉధృతి

హయత్నగర్: తుర్కయాంజాల్ మాసాబ్ చెరువు వరద బీభత్సం కొనసాగుతున్నది. చెరువులోకి ఎగువ నుంచి పెద్ద ఎత్తున వస్తున్న వరదతో మున్సిపాలిటీలోని పలు లోతట్టు కాలనీలు ముంపునకు గురయ్యాయి. మాసాబ్ చెరువు వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో 6 రోజులుగా దిగువన ఉన్న ఆపిల్ ఎవెన్యూ కాలనీ వరద ముంపులో చిక్కుకుంది. ఈ కాలనీలో అధికారులు సహాయక చర్యలు చేపట్టాలన్న వీలుకావడం లేదు. చెరువు వరద ప్రవాహం ఉగ్రరూపం దాల్చడంతో ఇంజాపూర్-తొర్రూర్ గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే మునగనూర్-పెద్ద అంబర్పేట గ్రామాల మార్గంలో వరద ఉధృతికి కల్వర్టు కొట్టుకుపోవంతో ఈ రెండు గ్రామాలకు 5 రోజులుగా సంబంధాలు తెగిపోయాయి. అదేవిధంగా మునగనూర్-హయత్నగర్ మార్గంలో రోడ్డుపై వరద ఉప్పొంగుతుండడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. మునగనూర్ వద్ద రోడ్డు దాటుతూ ఓ వాహనదారుడు కొ ట్టుకుపోతుండగా స్థానికులు కాపాడారు. మాసాబ్ చెరువు వరద ప్రవాహం ఇంజాపూర్, తొర్రూర్, మునగనూర్, పెద్ద అంబర్పేట గ్రామాల గుండా కొనసాగుతుండడంతో ఆ యా గ్రామాలకు చేరుకోవాలంటే వాహనదారులు ఇతర మార్గాల ద్వారా వెళ్లాల్సి వస్తున్నది.