హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): వృత్తిధర్మంలో భాగంగా ఎంతోమంది కరోనా రోగులను రక్షించి, చివరకు దాని బారినపడి తీవ్ర అస్వస్థతకు గురైన ప్రముఖ వైద్యుడు, కరోనా యోధుడు సత్యేంద్రప్రసాద్ మిశ్రా కోలుకున్నారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించడం వల్ల ఇది సాధ్యమైందని యశోద దవాఖాన డాక్టర్ పవన్ గోరుకంటి పేర్కొన్నా రు. మధ్యప్రదేశ్కు చెందిన డాక్టర్ సత్యేంద్ర మిశ్రా ఊపిరితిత్తులు 80% దెబ్బతినడంతో, ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారిందని, ఆయనను ఎయిర్ అంబులెన్స్లో సికింద్రాబాద్ యశోదకు తీసుకువచ్చారని చెప్పారు. డాక్టర్ మిశ్రాకు తమ క్రిటికల్ కేర్ బృందంతోపాటు పల్మనాలజీ నిపుణుల ఆధ్వర్యంలో చికిత్స అందించినట్టు వివరించారు. ఈ చికిత్సలో ఆయనకు ఎలాంటి హై-ఎండ్ యాంటిబయాటిక్స్ వాడలేదన్నారు. మొదటి వారంలోనే ఆయనకు అమర్చిన వెంటిలేటర్ను తొలగించినట్లు తెలిపారు. ఇప్పుడు ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, ఆక్సిజన్ అందించాల్సిన అవసరం లేకుండానే పల్మనరీ రీహాబిలిటేషన్ పొందుతున్నారని తెలిపారు. యశోద వైద్యంపై నమ్మకం ఉంచిన డాక్టర్ సత్యేంద్రమిశ్రాకు, ఆయన కుటుంబసభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు మళ్లీ వైద్యసేవలు అందించేందుకు డాక్టర్ మిశ్రా ఆసక్తిగా ఉన్నారని డాక్టర్ పవన్ వెల్లడించారు