ఇదే లక్ష్యంతో పని చేద్దాం
రాష్ట్ర అవసరాలు తీర్చడంలో ముందుందాం
రోజుకు కనీసం 35 రేకులు (వ్యాగన్లు) రవాణా జరగాలి
పటిష్టంగా కరోనా నివారణ చర్యలు, వైద్యం
త్వరలో గోదావరిఖనిలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్
డైరెక్టర్లు, జీఎంలతో సీఎండీ శ్రీధర్
సింగరేణి భవన్ నుంచి వీడియోకాన్ఫరెన్స్లో సమీక్ష
శ్రీరాంపూర్, మే 4 : రాష్ట్ర విద్యుత్ అవసరాలకు సరిపడా బొగ్గును అందించాలని, రోజుకు కనీసం 1.90 లక్షల టన్నుల ఉత్పత్తి చేసి రవాణా కూడా చేయాలని సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీధర్ సూచించారు. హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి డైరెక్టర్లు, అన్ని ఏరియాల జీఎంలతో మంగళవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి బొగ్గుకు డిమాండ్ ఉందని, దీనికి అనుగుణంగా రోజుకు కనీసం 35 రేకులు (రైలు బండ్ల) తగ్గకుండా రవాణా జరిగేలా చూడాలని జీఎంలను ఆదేశించారు. ఏరియాల వారీగానే బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాలని, ఈమేరకు జనరల్ మేనేజర్లకు అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. ఓపెన్కాస్ట్ గనులకు కావాల్సిన పేలుడు పదార్థాలను మహారాష్ట్ర నుంచి నిరంతర సరఫరాకు అనుమతించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విజ్ఞప్తి చేశామన్నారు. దీంతోపాటు సింగరేణి నిర్వహిస్తున్న ఎస్ఎంఈ ప్లాంట్ల నుంచి ఉత్పత్తిని 150 శాతానికి పెంచడం ద్వారా పేలుడు పదార్థాల కొరత లేకుండా చూస్తున్నామని తెలిపారు. ఏప్రిల్ నుంచి ఆడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు నుంచి ఉత్పత్తి ప్రారంభించామని, దీనిద్వారా రోజుకు కనీసం 6 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని కోరారు.
త్వరలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ ..
కొవిడ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో సింగరేణి ఏరియా దవాఖానల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చూసేందుకు రామగుండం ఏరియాస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ను 10 రోజుల్లో నెలకొల్పి ఉత్పత్తి ప్రారంభించాలని డైరెక్టర్ ఫైనాన్స్ బలారాంకు సూచించారు. ఇది అందుబాటులోకి వచ్చేలోగా పాల్వంచ, ఇతర పట్టణాల్లో నుంచి ఆక్సిజన్ కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని డైరెక్టర్లను ఆదేశించారు. ఫేస్ ఉద్యోగులను ఫ్రంట్లైన్ వారియర్లుగా గుర్తిస్తూ తక్షణమే టీకా ఇచ్చేందుకు వ్యాక్సిన్లను సమకూర్చుతున్నామని తెలిపారు. ఏరియా జనరల్ మేనేజర్లు ప్రతి రోజు కనీసం గంట సేపు కరోనా పరిస్థితులను సమీక్షించాలని ఆదేశించారు. దవాఖానలు, క్వారంటైన్ సెంటర్లో 24 గంటల పాటు వైద్య సేవలు అందించాలని, అవరమైతే డాక్టర్లు, సిబ్బందిని నియమించుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. సమావేశంలో ఈడీ జే అల్వీన్, జీఎం మార్కెటింగ్, కోఆర్డినేషన్ కే సూర్యనారాయణ, డైరెక్టర్లు చంద్రశేఖర్, బలారాం, సత్యనారాయణ, చీఫ్ మెడికల్ ఆఫీసర్ మాంత శ్రీనివాస్, శ్రీరాంపూర్ నుంచి జీఎం సురేశ్ పాల్గొన్నారు.