ప్రత్యేక ప్రతినిధి, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): కరోనాను తట్టుకొనే శక్తి తెలంగాణ ప్రజల్లో ఎంత వరకు పెరుగుతున్నది? ప్రతిరక్షకాలు ఏర్పడిన వారి సంఖ్య ఎంత? అసలు రాష్ట్రంలో కరోనా ఎంతమందిలో, ఏ మేరకు ప్రభావం చూపుతున్నది? అ నే విషయాలపై రాష్ట్రవ్యాప్తంగా ‘సెరో -పాజిటివిటీ’ సర్వే కోసం హైదరాబాద్లోని జాతీయ పోషకాహార సంస్థ(ఎన్ఐఎన్) నిపుణులు సిద్ధమయ్యారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సర్వే నిర్వహించగా, ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో అధ్యయనం చేయబోతున్నారు. సెరో సర్వే కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ఐఎన్కు సూచనలందాయి. దీంతో సర్వే కోసం వందమంది శాస్త్రవేత్తలు, నిపుణులతో ప్రత్యేక బృందాలు సిద్ధమయ్యాయి. ప్రభుత్వం సర్వేకు ఆదేశించిందని, ఆర్థికశాఖ నుంచి నిధులు రాగానే సర్వే ప్రారంభిస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు. గతేడాది మే నుంచి డిసెంబర్ వరకు మూడు దశల్లో జనగామ, కామారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో నిర్వహించిన శాస్త్రీయ అధ్యయనంలో 24 శాతం మంది లో ప్రతిరక్షకాలు ఏర్పడినట్టు వెల్లడైంది. 80 శాతం మందికి అసలు కరోనా వచ్చి పోయినట్లే తెలియదని తేలింది. హైదరాబాద్లో సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సంస్థలు జరిపిన సెరో-ఎపిడెమియాలాజికల్ (sero-positivity) సర్వేలో 50 శాతం మందిలో ప్రతిరక్షకాలు ఏర్పడినట్టు వెల్లడైంది.