20 ఏండ్ల అలుపెరుగని ప్రస్థానం
నాడు తెలంగాణకు.. నేడు బంగారు తెలంగాణ దిశగా పరుగులు
కంటోన్మెంట్/ సికింద్రాబాద్, ఏప్రిల్ 26: స్వరాష్ట్ర సిద్ధి కోసం మేథోమథనంలోంచి ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తన లక్ష్యమైన తెలంగాణ రాష్ట్రాన్ని ముద్దాడి, ప్రభుత్వ పగ్గాలు అందుకుని నేడు బంగారు తెలంగాణ కోసం పరుగులు పెడుతుంది. ఎన్నో ఇబ్బందులు, మరెన్నో ఆటంకాలు, అడ్డంకులను అధిగమిస్తూ రెండోసారి ప్రభుత్వ పగ్గాలు చేతబూని జనరంజకంగా నడుపుతున్న సంతృప్తిని ఆస్వాదిస్తూనే ఇటు పార్టీ అటు ప్రభుత్వ విధానాలను సమీక్షించుకుని భవిష్యత్తు వ్యూహానికి పదును పెట్టబోతున్నది. నగరంలోని హుస్సేన్సాగర్ ఒడ్డున జలదృశ్యంలో 20 ఏండ్ల కిందట 2001 ఏప్రిల్ 27న కేవలం వందలమంది ప్రతినిధుల సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఊపిరిపోసుకున్నది.
నగరం నడిబొడ్డున తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపుతిప్పింది.. టీఆర్ఎస్ బలాన్ని బలగాన్ని చాటి చెప్పింది.. ప్రజలను స్వరాష్ట్రం కోసం ఆలోచింపజేసేలా 2003 జనవరి 6వ తేదీన జరిగిన జింఖానాలోని సభనే. తమది ఒంటరి పోరాటం కాదన్న సందేశంతో నాటి సభ నుంచి ఎన్నో సభలకు సికింద్రాబాద్లోని పరేడ్ మైదానం నాందిగా నిలిచింది. 2008లో 7వ వార్షికోత్సవం ఏప్రిల్ 27వ తేదీన పరేడ్ గ్రౌండ్స్ సభకు ప్రజలు లక్షల సంఖ్యలో తరలివచ్చిన తీరు మహామహా రాజకీయ విశ్లేషకులను నివ్వెర పరిచింది. ఎడ్లబండ్లనుంచి మొదలుకొని లారీల దాకా ప్రజలే స్వచ్ఛందంగా సొంత ఖర్చులతో వాహనాలు మాట్లాడుకుని ప్రవాహంలా కదిలివచ్చారు. తెలంగాణ చరిత్ర, వర్తమానం, భవిష్యత్తు అన్ని అంశాలను తపిస్తూ ఉద్యమంలో మమేకం కావాలని కేసీఆర్ ఇచ్చిన పిలుపు ప్రజల గుండెల్లోకి దూసుకువెళ్లింది.
సికింద్రాబాద్ పరేడ్ మైదానం ఉద్యమాల గర్జనే కాదు.. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు చైతన్య దీపికగా నిలుస్తుంది. ఉద్యమ సమయంలో పరేడ్ మైదానంలో జనప్రభంజనానికి, తెలంగాణ రాష్ర్టానికి ఊపిరిగా నిలిచిన గ్రౌండ్.. తొలిసారిగా అధికారంలోకి వచ్చిన తరువాత 2014 అక్టోబర్ 19వ తేదీన పరేడ్లో జరిగిన బహిరంగ సభ చరిత్ర సృష్టించింది. ప్రభుత్వ పాలన, పాలసీకి సంబంధించి అడుగు పడిన నేల నుంచే ప్రభుత్వ పథకాల సంక్షేమం కోసం రూపకల్పన చేసింది కూడా ఇక్కడే. ఈ క్రమంలో 2015 ఏప్రిల్ 27వ తేదీన జరిగిన 15 ఏండ్ల ప్రస్థాన సభకు పరేడ్ మైదానమే వేదికైంది. ఆదే విధంగా ప్రభుత్వ పాలన నుంచి మధ్యంతర ఎన్నికలకు వెళ్లిన సమయంలో 2018 డిసెంబర్ 2న జరిగిన ప్రజా ఆశీర్వాద సభను సైతం ఇక్కడే నిర్వహించారు.