కనిపిస్తేనే కాటేసేలా తయారైందీ.. కరోనా. పెద్దోడా, చిన్నోడా, ఉన్నోడా, లేనోడా అన్న తేడా లేకుండా అందర్నీ కరిచేస్తున్నది. గత ఏడాది పలకరించి పోయా.. ఈసారి ఇంట్లోనే తిష్ట వేస్తానంటూ ప్రజల గుండెల్లో బుగులు రేపుతున్నది. ఒకరి నుంచి ఒకరిద్దరికి కాదు.. ఒకేసారి పదిమందిని పట్టి పీడిస్తున్నది.
గతం కంటే మరింత క్రూరత్వంతో దాడి చేస్తూ ప్రాణాలు తీస్తున్న వైరస్ వ్యాప్తిని అడ్డుకొనేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగా ‘రాత్రి కర్ఫ్యూ’ను ప్రయోగించింది.
హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): కరోనా కట్టడికి రాత్రి కర్ఫ్యూ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని, ప్రజలు ఇల్లు దాటి బయటికి రావొద్దని ఆదేశించింది. రాత్రి 8 గంటల్లోపే అన్ని వ్యాపారసంస్థలు, కార్యాలయాలు, దుకాణాలు, సంస్థలు, రెస్టారెంట్లు మూసేయాలని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు మే 1 ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉంటాయని మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఆదేశాలను అన్ని జిల్లాల కలెక్టర్లు, కమిషనర్లు, పోలీస్ సూపరింటెండెంట్లు కఠినంగా అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు. కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నందున స్థానిక పరిస్థితులకు తగ్గట్టు ఆంక్షలు విధించుకోవాలని కేంద్రహోంశాఖ మార్గదర్శకాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో రాత్రిపూట జనసంచారాన్ని నిలువరించేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశాలతో అధికారులు కర్ఫ్యూ విధించారు. సోమవారం రాత్రి నుంచే కర్ఫ్యూ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. నిబంధనలు ఉల్లంఘించినవారిపై విపత్తు నిర్వహణ చట్టం ఐపీసీ సెక్షన్ 188 కింద చర్యలు తీసుకోనున్నారు. మినహాయింపు ఇచ్చిన సంస్థలు, వ్యక్తులు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ సంస్థలు ఇచ్చే ఎమర్జెన్సీ డ్యూటీ గుర్తింపుకార్డు ఉండాలి. అన్ని ప్రైవేటు దవాఖానల్లో పనిచేసే వైద్యసిబ్బంది, డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్, పారామెడికల్ సిబ్బంది, దవాఖాన సర్వీస్ ప్రొవైడర్లు గుర్తింపుకార్డు తప్పనిసరి ఉపయోగించాలి.