జైపూర్: రాజస్థాన్లో నైట్ కర్ఫ్యూను మరో రెండు గంటలు పొడిగించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మొత్తం 12 గంటలు పాటించనున్నారు. ఈ నెల 16 నుంచి 30 వరకు ఈ మేరకు అమలు చేయనున్నారు. సీఎం అశోక్ గెహ్లాట్ నైట్ కర్ఫ్యూ పొడిగింపుపై బుధవారం నిర్ణయం తీసుకున్నారు.
రాజస్థాన్లో ఇప్పటికే 9 నగరాల్లో నైట్ కర్ఫ్యూను ఈ నెల 10 నుంచి అమలు చేస్తున్నారు. అజ్మీర్, అల్వార్, భిల్వారా, చిత్తోర్గఢ్, దుంగార్పూర్, జైపూర్, జోధ్పూర్, కోటా, అబూ రోడ్ రాత్రి 8 నుండి ఉదయం 6 గంటల వరకు, ఉదయపూర్లో సాయంత్రం 6 నుండి ఉదయం 6 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. అయితే ఈ నెల 16 నుంచి ఈ నగరాల్లో రాత్రి కర్ఫ్యూను 12 గంటలకు పొడిగించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలను సాయంత్రం 4 గంటలకు, అన్ని షాపులను సాయంత్రం 5 తర్వాత మూసివేయనున్నారు.
మరోవైపు రాష్ట్రంలో 10, 12 తరగతుల పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. 8,9,11 తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతికి ప్రమోట్ చేయాలని నిర్ణయించింది. రాజస్థాన్లో బుధవారం 6,200 కరోనా కేసులు, 29 మరణాలు నమోదయ్యాయి.