లింగాల, ఏప్రిల్ 13: లింగాల, బల్మూర్ మండలాల్లో మంగళవారం ప్లవనామ తెలుగు సంవత్సరాన్ని ప్రజలు వైభవంగా జరుపుకొన్నారు. పండుగలో ప్రాముఖ్యం కలిగిన షడ్రుచుల పచ్చడిని తయారు చేసుకొని పలువురికి పంచిపెట్టారు. మండల కేంద్రంలోని కోదండరామాలయం, అయ్యప్ప ఆలయంలో భక్తులు, రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామాలయంలో పూజారులు సుదర్శనాచార్యులు పంచాంగ శ్రవణం చదివి వినిపించారు. నూతన సంవత్సరంలో వర్షాలు, పంటలు ఏ విధంగా ఉంటాయేనని రైతులు పంచాంగ శ్రవణంలో తెలుసుకున్నారు. అదేవిధంగా మండలంలోని అంబట్పల్లి, శాయిన్పేట, అప్పాయిపల్లి తదితర గ్రామాల్లో ఉగాది పర్వదినాన్ని ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకొన్నారు. లింగాల, బల్మూర్ ఎంపీపీలు లింగమ్మ, అరుణ మండల ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ తిరుపతయ్య, శ్రీరామ స్వచ్ఛంద సంస్థ ఉపాధ్యక్షుడు నర్సోజీ, టీఆర్ఎస్ నాయకులు వెంకటగిరి, మల్లేశ్, శ్రీనివాసులు పాల్గొన్నారు.
పెంట్లవెల్లి మండలంలో..
పెంట్లవెల్లి, ఏప్రిల్ 13: మండలంలోని వివిధ గ్రామాల్లో ఉగాది పండుగ సంబురాలను మంగళవారం ఘనంగా జరుపుకొన్నారు. వివిధ గ్రామాల నుంచి ఇంటి ఆడపడుచులను ఆహ్వానించి ఉగాది పండుగ సందర్భంగా నూతన వస్ర్తాలు ధరించి పండుగను నిర్వహించుకున్నారు. ఆయా గ్రామాల్లో ఊయలలు, ఎద్దుల గిరికలు పోటీలు నిర్వహించి సంబురాలు చేసుకున్నారు. అనంతరం వివిధ గ్రామాల సమీపంలోని ప్రధాన ఆలయాల్లో పూజలు నిర్వహించారు.
అమ్రాబాద్ మండలంలో..
అమ్రాబాద్, ఏప్రిల్ 13: అమ్రాబాద్, పదర ఉమ్మడి మండలాల్లో ప్రజలు ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి ఒకరికి ఒకరు నూతన తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రత్యేక పిండివంటలు, షడ్రుచుల ఉగాది పచ్చడి సేవించారు. సాయంత్రం వివిధ ఆలయాలు, కోదండరామాలయం, వేణుగోపాలస్వామి, పదర రామాలయం, మద్దిమడుగు ఆంజనేయస్వామి ఆలయాల్లో నూతన ప్లవనామ సంవత్సర పంచాగపఠనాలను అర్చకులు శ్రీనివాసశర్మ, శ్రీకుమారశర్మ, వీరయ్యశాస్త్రి, చంద్రశేఖరశర్మ తదితరులు ప్రజలకు చదివి వినిపించారు. కార్యక్రమంలో ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
అచ్చంపేట మండలంలో..
అచ్చంపేట రూరల్, ఏప్రిల్ 13: ఉగాది పర్వదినం సందర్భంగా పట్టణంలోని భక్తమార్కండేయ శివాలయంలో మంగళవారం పంచాంగ శ్రావణం నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు చిదంబరశర్మ పంచాంగ శ్రవణం చదివి వినిపించారు. పద్మశాలీలు తమ పంచాంగాలను తెలుసుకుని ఉగాది శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. కార్యక్రమంలో పద్మశాలీ సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఆలయ కమిటీ అధ్యక్షుడు పర్వతాలు, నాయకులు యాదగిరి, కిశోర్, ధన్రాజ్, రాములు, రవీందర్, సత్యనారాయణ, వెంకటేశ్ తదితరులు ఉన్నారు.
ఉప్పునుంతల మండలంలో..
ఉప్పునుంతల, ఏప్రిల్ 13: ఉగాది పర్వదిన వేడుకలను మంగళవారం మండలంలో ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. ప్లవనామ సంవత్సరం అన్నివిధాలుగా సహకరించాలని, సుఖసంతోషాలతో పాడిపంటలతో తులతూగాలని మండల ప్రజలు ఆక్షించారు. స్థానిక శివాలయంలో సాయంత్రం పురోహితుడు శ్రీనివాసశర్మ పంచాంగ పఠనం చేశారు. ప్లవనామ సంవత్సరం అన్ని విధాలుగా ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు అనంతారెడ్డి, చంద్రారెడ్డి, జంగిరెడ్డి, జనార్దన్రెడ్డి, కుమారస్వామి, భూసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కోడేరు మండలంలో..
కోడేరు ఏప్రిల్ 13: మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు మంగళవారం ఉగాది వేడకలు వైభవంగా నిర్వహించుకున్నారు. ఆయా గ్రామాల్లో మహిళలు ఇండ్లల్లో తీపి వంటలు వండుకొని నైవేద్యం సమర్పించారు. సాయంత్రం ఆయా గ్రామాల్లోని ఆలయాల్లో ప్లవనామ సంవత్సరం పంచాంగాలను అర్చకులు చదివి వినిపించారు. కోడేరు హనుమాన్, చెన్నకేశవ ఆలయాల్లో అర్చకులు నరసింహమూర్తి గ్రామస్తుల రాశులు వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటస్వామి, నాయకులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.
సింగవట్నం ఆలయంలో..
కొల్లాపూర్, ఏప్రిల్ 13: కొల్లాపూర్ మండలం సింగవట్నంలోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ప్రధానాచార్యులు ఓరుగంటి సంపత్కుమార్శర్మ, ఓరుగంటి సతీశ్శర్మ పంచాంగశ్రవణం చదివి వినిపించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి చింతకుంట రాఘవేందర్ పాల్గొన్నారు.
పంచాంగ శ్రావణంలో ఎమ్మెల్యే బీరం
పట్టణంలోని రామాలయంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో అర్చకులు నిర్వహించిన పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, కౌన్సిలర్ రాముడుయాదవ్, టీఆర్ఎస్ నాయకులు, పట్టణ పురప్రముఖులు పాల్గొన్నారు.
పెద్దకొత్తపల్లి మండలంలో..
పెద్దకొత్తపల్లి, ఏప్రిల్ 13: మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు ఉగాది పండుగను ఘనంగా జరుపుకొన్నారు. వేకువజామునే ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయాల ఆవరణలో పండితులచే పంచాంగ శ్రవణం నిర్వహించారు.