హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): నిన్నటిదాకా.. సైబర్ బూచాళ్ల వలలో పిల్లలు పడిన సంఘటనలు చూశాం. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ వలలో పడిన బాలుడి ఉదంతం వెలుగుచూసింది. ఏడో తరగతి చదువుతున్న కరీంనగర్కు చెందిన బాలుడికి ఆన్లైన్ క్లాస్ల కోసం తల్లిదండ్రులు సెల్ఫోన్ కొనిస్తే చివరకు బీజేపీ నేతల చేతికి చిక్కి.. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రిపై అసభ్యకర ఫొటోలు, వీడియోలు పోస్టుచేసే స్థాయికి వెళ్లిపోయాడు. ఈ కేసులో బాలుడు రీఫేస్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని సినిమా నటులు డాన్సుచేసే వీడియోల్లో రాజకీయ ప్రముఖుల ఫొటోలను మార్ఫింగ్చేయడం అలవాటుగా మార్చుకొన్నాడు. బీజేపీ నేతలు ప్రోత్సహించడంతో సీఎం కేసీఆర్పై అదే పనిగా వీడియోలు పెట్టడం మొదలుపెట్టాడు. కొంతకాలానికి సొంతంగా యూట్యూట్ చానల్ను కూడా ఏర్పాటుచేశాడు. బీజేపీ సోషల్ మీడియా ప్రోద్బలం, ట్రోలింగ్ చేయడంతో వీక్షకుల సంఖ్య
పెరిగింది. సదరు బాలుడు మరింత రెచ్చిపోయాడు. చివరకు పోలీసుల చేతికి చిక్కాడు.
తల్లిదండ్రులదే బాధ్యత
మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల జరిగే అనర్థాలకు.. పోలీసులు వారి తల్లిదండ్రులను బాధ్యులను చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా పిల్లలుచేసే అసభ్యకర చేష్టలకు తల్లిదండ్రులను బాధ్యులను చేసే పరిస్థితులు వచ్చాయి. ఆన్లైన్ క్లాసులు కావడంతో ప్రతి ఇంట్లో పిల్లలకు ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. నిన్నటిదాకా ఇది సైబర్ నేరగాళ్లకు వరంగా మారితే.. ఇప్పుడు రాజకీయ, మతఛాందసవాదులకు అనుకూలంగా తయారైంది. పిల్లల్లో విషబీజాలు నాటుతూ వారిద్వారా తమ భావజాలాన్ని సమాజంలోకి చొప్పిస్తున్నారు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉంటే తప్ప ఇలాంటి రాజకీయ సైబర్ బూచాళ్ల నుంచి పిల్లల్ని కాపాడుకోలేకమని నిపుణులు, పోలీసులు సూచిస్తున్నారు.
జాగ్రత్తలు తప్పనిసరి
పిల్లలు ఏమి చేస్తున్నారనే విషయంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పర్యవేక్షణ ఉండాలి.
తల్లిదండ్రులు పిల్లలతో సున్నితంగా మెలగాలి. కఠినంగా ఉండటం అనర్థాలకు దారితీస్తుంది.
ఉపాధ్యాయులు ఏది మంచి.. ఏది చెడు అన్న అంశాలపై పిల్లలకు అవగాహన కల్పించాలి.
సెల్ఫోన్లు, ల్యాప్టాప్లతో ఎక్కువ సమయం గడపడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి.
మైనర్ పిల్లల ఇంటర్నెట్ వాడకంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మార్గనిర్దేశం అవసరం.
ఇతరులను కామెంట్ చేయడం, వ్యక్తులను, వ్యవస్థలను కించపరిచే ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్చేస్తే చర్యలుంటాయని పిల్లలకు అవగాహన కల్పించాలి.
సోషల్మీడియా వైపు పిల్లలు ఆకర్షితులు కాకుండా చూసుకోవాలి.
నేరాలు చేయడం వల్ల జరిగే నష్టాలను పిల్లలకు వివరించాలి.
రాజకీయాలు, మతపరమైన అంశాలు, వ్యక్తులను కించపరిచేలా పోస్టులు పెట్టడం, కామెంట్లు చేయడం నేరమని పిల్లలకు చెప్పాలి.
ఇంటర్నెట్ ద్వారా కొత్తవారికి పిల్లలు ఆకర్షితులు కాకుండా జాగ్రత్తపడాలి.
శిక్ష ఎవరికైనా ఒకటే
నేరం చేసే వారు ఎవరైనా సరే శిక్షలు ఒకేరకంగా ఉంటాయి. పిల్లలు కదా ఎవరూ పట్టించుకోరనుకొంటే పొరపాటే. ఉద్దేశపూర్వకంగా, నేరమయ బుద్ధితో చేసే అంశాలలో పిల్లలు, పెద్దలకు తేడా ఉండదు. మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలను పోస్టుచేస్తే మూడేండ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. పిల్లలు తెలిసీతెలియని వయస్సులో కొత్తవారితో పరిచయాలు చేసుకోవడం ద్వారా లేనిపోని వాటికి ఆకర్షితులవుతుంటారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏది మంచో, ఏది చెడో చెప్పాలి. పిల్లలు ఏంచేస్తున్నారనే విషయాలు తల్లిదండ్రులకు తెలియడం లేదు. ఓ బాలుడు మార్ఫింగ్ ఫొటోలు పెట్టడంతో నోటీసులు జారీచేశాం. ఆ బాలుడు సోషల్మీడియాలోనే ఎక్కువ సమయం గడుపుతూ ఇతరులు చెప్పే మాటలకు ఆకర్షితుడయ్యాడు.
-కేవీఎం ప్రసాద్, సైబర్క్రైమ్స్ ఏసీపీ, హైదరాబాద్
తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి
పసిప్రాయంలోనే పిల్లల్లో నేర స్వభావాన్ని కలిగించేవారు చాలమంది ఉన్నారు, దానికి ఇప్పుడు ఇంటర్నెట్ వేదికైంది. పిల్లలు తప్పుచేస్తే వారి బంగారు భవిష్యత్తు అంధకారమవుతుందనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలి. ప్రస్తుతం కొనసాగిస్తున్న ఆన్లైన్ క్లాసులను ఇంటర్నెట్ అవసరం లేకుండానే సెల్ఫోన్, ల్యాప్టాప్తో నిర్వహించవచ్చు. కొన్ని సంస్థలు ఇప్పటికే ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి. అందరూ ఈ విధానంలోకి అడుగుపెడితే పిల్లలను ఇంటర్నెట్కు దూరంగా ఉంచగలుగుతాం.
-దోసపాటి రాము, సామాజిక కార్యకర్త
తప్పొప్పులు చెప్పాలి
టీనేజీ పిల్లలతో తల్లిదండ్రులు స్నేహంగా ఉండాలి. ఇంటర్నెట్తో ఎన్నో రకాలైన కొత్త ప్రయోగాలు పిల్లలు చేస్తుంటారు. అందులో కొన్ని మార్పింగ్ ఫొటోలు, ఇతరులను తిట్టడం, పోర్నోగ్రఫీ చూడటం, ఆన్లైన్ గేమ్స్లో లోతుగా వెళ్లడం వంటివి చేస్తుంటారు. అది తప్పు అని తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలి. మంచి చెడుల మధ్య తేడాను వివరించాలి.
-కవిత, సైకియాట్రిస్ట్