వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో
వేదాంత కృద్వేద విదేవ చాహమ్
– భగవద్గీత (15.15)
‘సకల వేదాల ద్వారా తెలుసుకోబడవలసిన వాడను నేను మాత్రమే. వేదాంత రచయితను నేనే. వేదార్థాన్ని తెలిసిన వాడనూ నేనే’. సమస్త వేదాలను పఠించడం ద్వారా తెలుసుకునేది తనను మాత్రమేనని ‘భగవద్గీత’లో శ్రీకృష్ణ భగవానుడు ఉద్ఘాటించాడు. ‘వేదాంతం’ అంటేనే శ్రీకృష్ణుడు. సమస్త జ్ఞాన చరమ లక్ష్యం అతడే. ‘శ్రీకృష్ణుని వద్దకు చేర్చని జ్ఞానమేదైనా ఉందా?’ అంటే, అది ‘అజ్ఞానమే’. సమస్త వేద వేదాంగాలను, వేదాంత సూత్రాలను రచించిన వ్యాసదేవుల వారి మదిలో ఇంకా ఏదో తెలియని అసంతృప్తి నెలకొనిన వైనం ‘శ్రీమద్భాగవతం’లో మనకు గోచరిస్తుంది. ఈ సందర్భంలో వ్యాసదేవుల గురువైన శ్రీ నారద మునీంద్రులు అందుకుగల కారణాన్ని వివరించారు. ‘భౌతిక ప్రకృతిలోని త్రిగుణాలకు అతీతమైన దివ్యజ్ఞానంలో సైతం శ్రీకృష్ణుడు లేకపోతే అది పరిపూర్ణతను సంతరించుకొనజాలదు’ అన్నది నారదుని ఉద్బోధ.
నైష్కర్మ్యమప్యచ్యుత భావవర్జితం న శోభతే జ్ఞానమలం నిరఞ్జనమ్
కుతః పునః శశ్వదభద్రమీశ్వరే న చార్పితం కర్మ యదప్య కారణమ్
శ్రీమద్భాగవతం (1.5.12)
‘ఆత్మజ్ఞానం, అది నిష్కామకర్మ సహితమైనా అందులో భగవద్భావం లేనిదే శోభించదు. ఇక ఆదినుంచి సహజంగానే బాధలతో కూడుకున్న అశాశ్వతమైన వివిధ కామ్యకర్మలను భగవత్సేవలో అర్పించనప్పుడు వాటివల్ల ప్రయోజనమేమిటి?’ -గౌడీయ వైష్ణవ పరంపరలో సుప్రసిద్ధ ఆచార్య మహనీయుల్లో ఒకరైన శ్రీల జీవ గోస్వాములవారు ‘పద్మ’, ‘స్కంద’, ‘లింగ’ అనే మూడు ప్రామాణిక పురాణాల్లో పేర్కొన్న ఈ కింది శ్లోకాన్ని ప్రస్తావించారు-
ఆలోక్య సర్వశాస్ర్తాని విచార్య చ పునఃపునః
ఇదం ఏకం సునిష్పన్నమ్ ధాయేత్ నారాయణః సదా॥
‘సమస్త పురాణాలనూ మళ్లీ మళ్లీ విచారించిన పిదప శ్రీమన్నారాయణుడే పరమసత్యమని, నారాయణుడొక్కడే సదా ఆరాధ్యనీయుడన్న విషయం నిర్ధారితమైంది’. ఇదే సత్యమని ‘గరుడ పురాణం’ కూడా పరోక్షంగా స్పష్టం చేసింది.
పారంగతోపి వేదానామ్ సర్వశాస్ర్తార్థ వేద్యపి
యో న సర్వేశ్వరే భక్తస్తమ్ విద్యాత్ పురుషాధమమ్
వేదాలను ఈ చివరినుంచి ఆ చివరివరకూ వల్లె వేసినా, సమస్త శాస్ర్తార్థాలలో ప్రావీణ్యుడైనా, ఆ సర్వేశ్వరుని భక్తుడు కాకపోతే అతడు పురుషాధముడే’. సమస్త వేదమంత్రాలు, కర్మజ్ఞాన ఉపాసన కాండములు, ఆధ్యాత్మిక ఆచారాలు, యజ్ఞ యాగాదులు, జ్ఞాన సముపార్జన, కర్తవ్య నిర్వహణల లక్ష్యం, జీవాత్మను ఆ వాసుదేవుని దివ్యచరణాల వద్దకు చేర్చడమేనని చెబుతూ ‘భాగవతం’ ఇలా వివరించింది.
వాసుదేవ- పరావేదా వాసుదేవ- పరామఖాః
వాసుదేవ- పరాయోగా వాసుదేవ- పరాఃక్రియాః
వాసుదేవ- పరంజ్ఞానం వాసుదేవ పరంతపః
వాసుదేవ పరోధర్మో వాసుదేవ- పరాగతిః
శ్రీమద్భాగవతం (1.2.28-29)
పలు శాస్ర్తాల నుంచి సంగ్రహించిన పై నిర్దేశాలన్నీ ‘నారాయణుడు లేదా శ్రీకృష్ణుడు లేని వేదాంతం రాముడు లేని రామరాజ్యం వంటిదేనని’ సూచిస్తున్నాయి. శ్రీల ప్రభుపాదుల వారు తమ గీతాభాష్యం (భగవద్గీత: 2.46)లో ‘పరమ పవిత్రమైన భగవన్నామాలను జపించటంలో రమించేవాడే అత్యున్నత వేదాంతి. వేదాంతసారం అంతిమ లక్ష్యమూ అదే’ అని ప్రస్తావించారు. దీనిద్వారా సమస్త జ్ఞానానికీ చరమాశ్రయం శ్రీకృష్ణుడేనన్న సంగతి సుస్పష్టమవుతున్నది. హరే కృష్ణ!
శ్రీమాన్ సత్యగౌర
చంద్రదాస ప్రభూజి
93969 56984
ఇవి కూడా చదవండి..