కరోనా కథ ముగుస్తున్నది అనుకుంటున్న తరుణంలో వైరస్ మళ్లీ పడగ ఎత్తి బుసకొడుతున్నది. దేశవ్యాప్తంగా పదకొండు రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఒక్కరోజే అత్యధికంగా లక్షా పదిహేను వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో ఒక్క రోజులోనే 55 వేల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. కొన్ని రాష్ర్టాలలో రాత్రి కర్ఫ్యూ తదితర ఆంక్షలు విధిస్తున్నారు. కరోనా వైరస్ రెండవ దశలో మరింత వేగంగా విస్తరిస్తున్నదని, వచ్చే నాలుగు వారాలు కీలకమని నిపుణులు చెబుతున్నారు. రెండో దశను ఎదుర్కొనడానికి ప్రజలను సిద్ధం చేస్తూనే, టీకాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. మళ్లీ తొలిదశ వైరస్ వ్యాపించిన నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.
గత ఏడాది వైరస్ వ్యాప్తి మొదలైన తరువాత కొన్ని నెలల పాటు తీవ్ర భయంలో, మానసిక ఒత్తిడితో గడిపాం. అజ్ఞాత శత్రువుతో పోరాడుతున్న అయోమయం ఆనాటిది. కొన్ని నెలలపాటు చెలరేగిపోయిన వైరస్ జనవరి- ఫిబ్రవరి ప్రాంతంలో ఉపశమిస్తూ కొంత తెరిపినిచ్చింది. దీంతో ఒత్తిడి సడలి భయం నుంచి బయటపడ్డాం. యుద్ధంలో శత్రువు ఏమాత్రం విరామం ఇచ్చినా కోలుకొని ఎదురుదాడికి సమాయత్తం కావచ్చు. కరోనా వ్యాపించిన మొదటి దశలో ఈ వైరస్ స్వభావం, ఎదుర్కొనే విధానంపై స్పష్టత లేకుండేది. ఇప్పుడు అవగాహన ఏర్పడటంతోపాటు వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చింది. గత ఏడాది అనుభవాల నేపథ్యంలో ప్రభుత్వ వ్యూహంలో కూడా మార్పు కనిపిస్తున్నది. అప్పుడు కరోనా కట్టడికి మొత్తంగా లాక్డౌన్ విధించాల్సి వచ్చింది. దీనివల్ల ఆర్థికంగా పెను దెబ్బ తగిలింది. ఇంకా కోలుకోకముందే మళ్లీ ఆంక్షలు విధిస్తూ పోతే, సమాజం అల్లకల్లోలమవుతుంది. అందువల్ల పీడిత ప్రాంతాలను గుర్తించి కట్టడి చేస్తున్నారు.
పోరాటం స్వల్పకాలికం అయినప్పుడు ఎన్ని కఠిన చర్యలైనా తీసుకోవచ్చు. కానీ ఇప్పటికే ఏడాది దాటింది. ఈ పోరాటం ఎప్పుడు ముగుస్తుందో తెలువదు. అందువల్ల ప్రజలు దీర్ఘకాలికంగా సమాయత్తం కావాలి. పరిస్థితి విషమించే కొద్దీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవలసి వస్తుంది. అవి అందరికీ నష్టదాయకమే అయినందున ఆచితూచి వ్యవహరించవలసి వస్తున్నది. రెండో దశ వైరస్ వ్యాప్తిని ఎదుర్కొనే బాధ్యత ఎక్కువగా ప్రజలపైనే ఉన్నది. తప్పనిసరైతేనే బయటకు వెళ్లాలి. సామూహిక కార్యక్రమాలు భారీ ఎత్తున నిర్వహించకూడదు. పరస్పరం దూరం పాటించాలి. అన్నిటికీ మించి మాస్క్ను తప్పనిసరిగా ధరించాలి. రోజువారీ కార్యక్రమాలు సాగిస్తూనే జాగ్రత్తగా ఉండటం అలవరచుకోవాలి. మొదటి దశను ప్రజలంతా క్రమశిక్షణ, దృఢ నిశ్చయంతో ఎదుర్కొన్న తీరు ప్రశంసనీయం. ఇప్పుడు మళ్లీ అదే స్ఫూర్తిని కనబరిస్తేనే ఈ పీడకు విరగడ.
ఇవి కూడా చదవండి..