నల్లగొండ : నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా అనుముల మండలం ఇబ్రహీంపేటలో మంగళవారం ఏర్పాటు చేసిన సలాం ఇబ్రహీంపేట కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ను భారీ మెజారిటీతో గెల్పించాల్సిందిగా మైనార్టీ నాయకులను కోరారు. గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ముస్లింలను పట్టించుకోలేదన్న ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాతనే సీఎం కేసీఆర్ వల్లే ముస్లింలకు న్యాయం జరిగిందన్నారు. మైనారిటీ పిల్లల కోసం మైనారిటీ స్కూల్స్, విదేశీ చదువులు, పేద అమ్మాయిల పెళ్లిళ్ల కోసం షాది ముబారక్ ఇతర అనేక సంక్షేమ పధకాలు కేసీఆర్ ప్రవేశ పెట్టినట్లు తెలిపారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పధకాలు మన రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. సంక్షేమం, అభివృద్ధిలో మన రాష్ట్రందే అగ్రస్థానం అన్నారు. సీఎం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ను అధిక మెజార్టీతో గెలిపించి సీఎంకు కానుకగా ఇద్దామన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఏఎంసీ చైర్మన్ నీలిమ, ఆప్కాబ్ మాజీ చైర్మన్ విజేందర్ రెడ్డి, హాలియా మున్సిపాలిటీ ఇంచార్జ్ బాసిత్, అబ్బాస్, మునీర్, ఫరిదుద్దీన్, హాలియా ముస్లిం మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.