నిజాంపేటలో నిజాం హాస్పిటల్, రేష్మా క్లినిక్ సీజ్
అర్హత లేకున్నా నడుపుతున్నట్లు ఫిర్యాదులు అందాయి
త్వరలోనే మరికొన్నింటిని సీజ్ చేస్తాం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి మల్లికార్జున్రావు
దుండిగల్, ఏప్రిల్ 1 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పలు ప్రైవేట్ క్లినిక్లపై గురువారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నిజాంపేట-బాచుపల్లి ప్రధాన రహదారిలోని నిజాం హాస్పిటల్తో పాటు రేష్మా క్లినిక్లను సీజ్చేశారు. అనంతరం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.కె.మల్లికార్జున్రావు మాట్లాడుతూ అనుమతులు, అర్హులైన వైద్యులు లేకుండానే వైద్యశాలను ఏర్పాటు చేసి చికిత్సలు నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించామన్నారు. తెలిసీతెలియని వైద్యం అందజేస్తూ ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్న క్లినిక్లను సీజ్ చేస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు ఇదే ప్రాంతంలో మరికొన్ని క్లినిక్లు, దవాఖానలు, డెంటల్ దవాఖానలు, ఫిజియోథెరఫి క్లినిక్లు, డయోగ్నోస్టిక్ సెంటర్లు అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. త్వరలోనే అలాంటి వాటిని గుర్తించి సీజ్ చేస్తామని తెలిపారు. ఆయన వెంట జిల్లా మాస్ మీడియా అధికారి వేణుగోపాల్రెడ్డి, శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో సుమారు 470కి పైగా ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు దవాఖానలు నిర్వహిస్తున్నారు. వీరిలో కొందరు ఫస్ట్ఎయిడ్ సెంటర్ల పేరుతో క్లినిక్లు నడుపుతుండగా మరికొందరు ఏకంగా వైద్యశాలలు, నర్సింగ్ హోంలు, పాలీ క్లినిక్ల పేరుతో దవాఖానలు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు డయోగ్నొస్టిక్ ల్యాబ్లు, మెడికల్ షాపులను ఏర్పాటు చేసుకొని దందా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మల్లంపేట, సూరారం వంటి ప్రాంతాల్లో కనీసం పదవ తరగతి పాస్కాని వారు సైతం క్లినిక్లు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. వాస్తవానికి ఒక దవాఖాన నడుపాలంటే కనీసం ఒక్కరైన క్వాలీఫైడ్ వైద్యులు ఉండాలి. కానీ ఇక్కడ ఆ పరిస్థితులు ఏమాత్రం లేవని స్వయంగా అధికారులే పేర్కొనటం గమనార్హం. అయితే జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఇక నుంచి క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి, చర్యలు తీసుకుంటామని పేర్కొనడంతో నకిలీ వైద్యులకు వణుకు మొదలైనట్లు తెలుస్తున్నది.