న్యూఢిల్లీ: దేశీయ ఆటోమోబైల్ సంస్థల్లో ఒకటైన టాటా మోటార్స్కు గట్టి షాక్ తగిలింది. ఇటీవల టాటా మోటార్స్ నూతన మేనేజింగ్ డైరెక్టర్ కం సీఈవోగా మార్క్ ల్లిస్టోసెల్లా ఎంపికయ్యారు. నెల రోజుల క్రిందట ఎంపికైన మార్క్ ల్లిస్టోసెల్లా.. తాజాగా ఆ బాధ్యతలు స్వీకరించబోవడం లేదని శుక్రవారం ప్రకటించారు. దీంతో భారత్ ఆటోమొబైల్ పరిశ్రమ అంతా ఆశ్చర్యపోయింది. మార్క్ ల్లిస్టోసెల్లా తనకు తానుగా వైదొలిగారా? టాటా మోటార్స్ తన ఆఫర్ను ఉపసంహరించుకున్నదా? అన్న సంగతి తెలియరాలేదు.
హారియర్, సఫారీ రేంజ్ యుటిలిటీ వాహనాలకు పెట్టింది పేరుగా ఉన్న టాటా మోటార్స్ పూర్తి వివరాలను వెల్లడించడానికి నిరాకరించింది. ప్రస్తుతం సీఈవో కం ఎండీగా ఉన్న గ్యుంటేర్ బుచెక్ వచ్చే జూన్ 30వ తేదీ వరకు కొనసాగుతారు. ఈ లో్గా బుచెక్ వారసుడ్ని టాటా మోటార్స్ ఎంపిక చేయకపోతే.. సీఈవో కం ఎండీ లేకుండానే ముందుకు సాగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. బుచెక్ వారసుడి కోసం అన్వేషిస్తున్నట్లు టాటా మోటార్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు.
బుచెక్ నియామకానికి ముందు రెండేండ్ల పాటు సీఈవో కం ఎండీ లేకుండానే టాటా మోటార్స్ నడిచింది. ఒకవేళ బుచెక్ వారసుడిని ఎంపిక చేయకుంటే, మూడోసారి టాటా మోటార్స్ ఎండీ కం సీఈవో లేకుండానే కార్యకలాపాలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. కార్ల్ స్ల్యేమ్ అకస్మిక మరణం తర్వాత, 2012లో ప్రకాశ్ తేలంగ్ రిటైర్మెంట్ తర్వాత 2014-16 మధ్య టాటా మోటార్స్ సీఈవో కం ఎండీ లేకుండానే ముందుకు సాగింది.