నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు
కరీంనగర్ రూరల్, మార్చి 18: కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్లో చిన్న గుహలో వెలిసిన కొచ్చెగుట్ట మల్లన్న కోరిన భక్తుల కొంగుబంగారంగా ప్రసిద్ధి చెందారు. గుర్రపు అడుగుల గుర్తులున్న ఏకైక ఆలయంగా గుర్తింపు పొందడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. బొమ్మకల్కు చెందిన యాదవులు ప్రతి సంవత్సరం తాము పండించిన పంట నుంచి మల్లన్నకు మొదటి బోనం చేయడం ఆనవాయితీగా వస్తున్నది. యాదవ సంఘం ఆధ్వర్యంలో ఐదేళ్ల క్రితం మల్లికార్జున స్వామి ఆలయాన్ని నిర్మించి, ప్రతి సంవత్సరం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కాగా, శుక్రవారం నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయానికి రంగులు వేసి ముస్తాబు చేశారు. ఆలయ ఆవరణలో చలువ పందిళ్లు వేయిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాల్వ మురళీయాదవ్, కాల్వ మల్లేశం యాదవ్ తెలిపారు. 19న ఉదయం 7 గంటలకు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, ఉదయం 10.35 గంటలకు గణపతి హోమం, 11.30 గంటలకు సామూహిక కుంకుమార్చన, సాయంత్రం 5 గంటలకు స్వామి వారికి శేష వాహన సేవ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 20వ తేదీన ఉదయం మహారుద్రాభిషేకం, 9 గంటలకు చండీహోమం, మధ్యాహ్నం 12 గంటలకు అగ్నిగుండాలు, సాయంత్రం 5.30 గంటలకు మయూర వాహన సేవ నిర్వహించనున్నట్లు తెలిపారు. 21న ఉదయం 9 గంటలకు కేతమ్మ భ్రమరాంబికా సహిత మల్లికార్జున స్వామి కల్యాణం, ఉదయం 11 గంటలకు వసంతోత్సవం, మధ్యాహ్నం ఒంటి గంటకు పుష్పయాగం, సాయంత్రం 5 గంటలకు విగ్రహాల ఊరేగింపు, తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.