“ఒక్కగానొక్క కొడుకు తన కన్నతండ్రినే హత్య చేశాడని మీరెందుకు పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ ఇచ్చారు?” అడిగాడు డిఫెన్స్ లాయర్, కోర్టు బోనులో నిలబడి ఉన్న మాణిక్యమ్మను.
“ఎందుకంటే, ఆ కొడుకు తండ్రి మరణానికి కారకుడైనాడనేది నాకు మాత్రమే బాగా తెలుసు కాబట్టి. వాడెంత క్రిమినల్ మైండ్ ఉన్నవాడో తెలుసు కాబట్టి”
“అంటే ఆయన తన తండ్రిని చంపడం మీరు కళ్లారా చూశారా? ఏ ఆయుధంతో చంపాడు? గొంతు పిసికాడా? విషం పెట్టాడా? ఎలా చంపాడు? పైగా హత్య చేసేందుకు ఏదో ఒక బలమైన కారణమో, ఉద్దేశమో ఉంటుంది. అదేమిటి?
“కంటికి కనిపించే ఎలాంటి మారణాయుధాలూ ఉపయోగించలేదు. విష ప్రయోగం చేయలేదు. భౌతికదాడికి పాల్పడలేదు. అతను.. కన్నతండ్రిని ఎలా చంపాడో ఏ ఫోరెన్సిక్ సైంటిస్టులు, పోలీసులు కూడా కనుక్కోలేరు” అంటూ ఎదురుగా బోనులో ఉన్న 30 ఏండ్ల యువకుడు శంతనకుమార్ వైపు ఉరిమి చూస్తోందామె.
“ఇంతకీ మీకూ, మృతుడు సంజీవరావుకు ఉన్న సంబంధమేంటి?” రెట్టించాడు డిఫెన్స్ లాయర్.
“సంబంధమంటే ఏం చెబుతాను సర్? మనిషికీ మనిషికీ మధ్య ఉన్న సంబంధమే సర్! ఆయనకు భార్య చనిపోయింది. ఒంటరితనంతో బాధ పడుతున్నారు. పొరుగునే ఉన్న నాకు భర్త చనిపోయాడు. ఇద్దరమూ వృద్ధులం. తోడు కోల్పోయినవాళ్లం. కాబట్టి, ఒకరికొకరం కష్టసుఖాలు చెప్పుకుని ఓదార్చుకునేవాళ్లం. ఈ న్యాయదేవత గుడిలో ప్రమాణపూర్వకంగా చెబుతున్నాను, ఇంతకుమించి మా మధ్య గుచ్చిగుచ్చి అడుగాల్సిన మరెలాంటి అనైతికమైన సంబంధమూ లేదండి!”
“సరే, శ్రీరాముడు పుట్టిన ఈ దేశంలో తండ్రిని ఏ కన్న కొడుకైనా చంపగలడని నువ్వెలా అభియోగం మోపగలవు?” అడిగాడు డిఫెన్స్ లాయర్.
“అబ్జెక్షన్ యువరానర్. డిఫెన్స్ లాయర్ గారు ఏ కన్న కొడుకూ తండ్రిని చంపేటంత నేరాన్ని ఈ దేశంలో చేయడనేటట్లు మాట్లాడుతున్నారు. ఇది న్యాయశాస్ర్తానికే విరుద్ధం. అసంబద్ధం. ఎందుకంటే, మన దేశంలో సొంత తల్లిదండ్రులను చంపిన నేరాలు నిరూపితమై ఎంతోమంది కొడుకులు జైళ్లలో ఊచలు లెక్కపెడుతున్నారు. నేను అలాంటివారి జాబితాను ఓ వారం రోజుల్లో కోర్టు ముందుంచుతాను, కావాలంటే..”
“అక్కర్లేదండీ! ఆ జాబితాతో ఈ కేసుకేం పని? డిఫెన్స్ లాయర్గారు ఏదో ఉద్వేగంలో అలాంటి మాట అన్నారంతే” అన్నారు జడ్జిగారు.
“మైలార్డ్! ఇక్కడ కొడుకు శ్రీరాముడు లాంటివాడు కాదు. ఈ కేసులో తండ్రి మృతికి కన్న కొడుకే కారణమయ్యాడనేది నా అనుమానం. దాని గురించి పోలీసులు దర్యాప్తు చేసి, ఏవైనా సాక్ష్యాధారాలను సంపాదించి, కోర్టు ముందుంచాలి. నాకు ఫలానా వారిమీద అనుమానముందని చెప్పేంతవరకే నేను చేయగలను” అంది మాణిక్యమ్మ.
“నిరాధారంగా, బాధ్యతా రాహిత్యంతో గౌరవప్రదంగా బతుకుతున్న ఓ మంచి కొడుకుపై పనీపాటల్లేక నిందలు వేయడం తగదు మీలాంటి పెద్దవారికి” అన్నాడు డిఫెన్స్ లాయర్.
“ముమ్మాటికీ కొడుకు నిర్వాకం వల్లే ఆయన మరణించాడనేది నా అభియోగం. అది తప్పనుకుంటే మరి ఆయన ఎలా చనిపోయాడో మీరు చెప్పండి చూద్దాం!!” తిరిగి డిఫెన్స్ లాయర్నే ఎదురు ప్రశ్నించింది మాణిక్యమ్మ.
దాంతో డిఫెన్స్ లాయర్గారు గొంతు సవరించుకుని, “మృతుడు సంజీవరావు 30 ఏండ్లుగా మధుమేహ వ్యాధిగ్రస్తుడు. సాధారణంగా వయసుమీద పడి, ముసలితనం రావడంతోనే తన ఎనభయ్యో ఏట చనిపోయాడు. పైగా ఆయనకు లేని జబ్బులేమిటి? హై బీపీ ఉంది. గ్యాస్ట్రిక్ సమస్య ఉంది. ప్రోస్టేట్ వాపు రావడంతో దాని గురించి గతంలో ఒకసారి ఆపరేషన్ కూడా జరిగింది. కాలు ఫ్రాక్చర్ అయింది. తరచుగా బాధించే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఉంది. వీటన్నిటికంటే ఆయనకు కిడ్నీలు కూడా అరవై శాతం దెబ్బతిన్నాయి. అందువల్ల ఆయన పడుకున్నప్పుడు ప్రశాంతంగా నిద్రలోనే హృదయ
ఘాతంతో గుండె ఆగిపోయి, హాయిగా సుఖమరణం సంభవించింది. ఆయన చావు గురించి బంధువుల్లో మరెవ్వరికీ రాని అనుమానం పొరుగున ఉన్న మీకే ఎందుకు వచ్చింది
మాణిక్యమ్మగారూ..? మీరేమైనా ఆయనకు దగ్గరి బంధువా? అసలు ఆయన చావు గురించి మీకేం సంబంధం ఉందని పోలీసులకు రిపోర్టు చేశారు? ఇలాగే మన దేశంలో ఉత్తుత్తి అనుమానాలతో ఇరుగుపొరుగు మీద కంప్లయింట్ చేసుకుంటూ పోతే, వాటిని విచారించేందుకు ఎన్ని లక్షల కోర్టు భవనాలు, దర్యాప్తు చేయడానికి ఎన్ని వేలమంది పోలీసు సిబ్బంది కావాలో ఒకసారి ఆలోచించండి!” గర్జించాడు డిఫెన్స్ లాయర్.
“అబ్జెక్షన్ యువరానర్! ఎలాంటి రక్త సంబంధం లేకున్నా, ఒక మనిషి మరణం గురించి మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. కేవలం రక్త సంబంధీకులే పోలీసు కంప్లయింట్ ఇవ్వాలనేం లేదు. అలాగే, అనుమానించడమే పెద్ద నేరమైనట్లు మాట్లాడుతున్నారు డిఫెన్స్ లాయర్గారు. ఇది కలికాలం. రోజులు బాగా లేవు. మన నీడను సైతం అనుమానించాల్సిన దుర్భరమైన రోజులు. మా క్లయింటును డిఫెన్స్ లాయర్గారు భయపెట్టేందుకు ఏవేవో అసంబద్ధమైన ప్రశ్నలు, వాదనల్ని తెరమీదకి తెస్తూ, నిజానికి వారే కోర్టు సమయాన్ని చాలా వృథా చేస్తున్నారు” అన్నారు ప్రాసిక్యూషన్ లాయర్.
“అబ్జెక్షన్ సస్టెయిన్డ్..” అన్నారు కళ్లద్దాల్లోంచి జడ్జిగారు.
మళ్లీ మాణిక్యమ్మ తన వాగ్దాటిని కొనసాగించింది.
“సర్! ఆ అబ్బాయి తన తండ్రి గురించి ఏదైనా ఉపయోగపడే ఒక్క మంచి పనిని మనస్ఫూర్తిగా చేశాడేమో కనుక్కోండి? ఎన్నడైనా తన తండ్రికి ఒక జత బట్టలు కుట్టించి ఇచ్చాడా? ఒక జత చెప్పులుగానీ, బూట్లుకానీ కొనిచ్చాడా? ఆయనకు మంచి ఆహారం తినిపించాడా? ఆయన ఒంటేలు ఎత్తి వేశాడా? ఆయన వాంతి చేసుకుంటే కడిగాడా? ఆయన గుడ్డలు శుభ్రం చేశాడా? ఆయనకు స్నానానికి వేడినీళ్లు తోడాడా? లేకపోతే ఆయనకు నెలవారీ మందులకయ్యే ఖర్చు భరించాడా? చెప్పమనండి! ఏదైనా తన తండ్రికి అతను తన చేజేతులా కొనిపెట్టినట్లు ఒక్క షాపు బిల్లు ఉన్నా చూపించమనండి..” అంది.
కోర్టులో నిశ్శబ్దం నెలకొంది. మాణిక్యమ్మ వైపు కొరకొరా చూస్తున్నాడు ముద్దాయి శంతనకుమార్.
“ఈ ముదనష్టపు కొడుకు ఆ పెద్దాయనతో ఒకరోజు సాయంత్రం గొడవపడి, ఆ పాతబడ్డ ఇంట్లో ఆయనను ఒంటరిగా వదిలేసి, రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి భార్యను తీసుకుని కొత్త ఇంటికి వెళ్లిపోయాడు. అదివరకే కొత్తగా కట్టుకున్న ఇంట్లోకి వెళ్లేందుకు ఏదో ఒక సాకుతో ఊరకనే గొడవపడి వెళ్లిపోయారంతే. ఆ తర్వాత పెద్దాయన హోటల్లో తింటుండటంతో, ఊర్లో వాళ్లందరూ ‘కన్నతండ్రికి ఇంత అన్నం పెట్టలేవా?’ అని మందలించడంతో, తండ్రికి రోజుకు రెండు పూటలా భోజనం తెచ్చి పెట్టేవాడు. అదికూడా వేళకు తగినట్లుగా ఠంచనుగా రోజూ తెచ్చి పెట్టేవాడా? లేదు. పైగా ఆ తెచ్చిన భోజనాన్ని ఇంటి లోపలికి వెళ్లి ఇచ్చేవాడు కూడా కాదు. ఆ పాత ఇంటి గేటువద్ద, తిరస్కారంగా బ్యాగును విసిరేసి వెళ్లిపోయేవాడు. అదికూడా ఒక్కోరోజు తను ఊర్లో లేకపోతే, ఆ రోజు పెద్దాయనకు ఎవరూ భోజనం తెచ్చి పెట్టేవారు కాదు. ఆయనకు కనీసం ఫలానా రోజు అన్నం తేవట్లేదని ఫోన్లో ముందుగానే ఒక్కమాట కూడా చెప్పేవాడు కాదు. చివరికి ఏ రోజైనా భోజనం తెచ్చి పెట్టకపోతే పొరుగునే ఉన్న మా ఇంట్లోంచి భోజనం పంపించే వాళ్లం. ఆ కన్న కొడుకనేవాడు ఏ రోజూ తన తండ్రితో ఆప్యాయంగా ఒక్క నిమిషం కూడా మాట్లాడింది నేను చూడలేదు. వృద్ధాప్యంలో ఉన్నవారు చిన్న పిల్లలతో సమానం సార్! మరి అలాంటివాళ్లను ఎవరైనా ఒంటరిగా పాత కొంపలో వదిలేసి, భార్యను తీసుకుని వెళ్లి వేరే కాపురం పెడతారా? మీరే చెప్పండి! వర్షం కురుస్తున్న రాత్రుల్లో ఒంటరిగా అంత పెద్ద పాత ఇంట్లో ఆయన ఒక్కడే ఉన్నప్పుడు, విద్యుత్ సరఫరా బంద్ అయినప్పుడు, చీకట్లో ఆయన ఎంత అవస్థ పడ్డాడో ఆ సర్వేశ్వరుడికే తెలుసు. ఇలాంటి కొడుకు మాత్రం ఎవరికీ పుట్టకూడదు సార్!”
“అదేమిటి? ఊర్లో అందరూ ఈ అబ్బాయిని వేనోళ్ల కొనియాడుతుంటే నువ్వేమో దుర్మార్గుడిలాగా చిత్రిస్తున్నావు. ఈ అబ్బాయి స్వయంకృషికి మారుపేరు. కష్టపడి జీవితంలో పైకొచ్చాడు. పెద్దలంటే అతనికి ఎంతో వినయం! పైగా ఒక్క పాడు అలవాటు లేదు. సిగరెట్లు కాల్చడు. మద్యం తాగడు. పరాయి మహిళవైపు ఎప్పుడూ కన్నెత్తి చూడలేదు. ఇలాంటి శ్రీరామచంద్రుడిని పట్టుకుని ఒక దుష్టుడని చెబుతున్నావే? నీ ఆలోచన సరిగ్గానే ఉందా?” గట్టిగా నిలదీశాడు డిఫెన్స్ లాయర్.
“సార్.. శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలనకోసం అడవికి వెళ్లాడు. ఆయనతో ఇతనికి పోలికేంటి సర్! భార్య కొంగు పట్టుకుని, కన్నతండ్రిని అసహ్యించుకుని వేరే కాపురం పెట్టాడితను. ఆ పెద్దాయనకు ఇంకో కొడుకో, కూతురో ఉండివుంటే కనీసం వారైనా ఆయన బాగోగులు చూసుకునేవారు. భార్యకూడా బతికి లేదాయె. ఎవ్వరూ లేరాయె. దేశంలో ఇలాంటి వృద్ధుల పరిస్థితి ఏమిటి? రోగాలతో బాధ పడుతూ ఎనభై ఏండ్లు పైబడిన వృద్ధుడిని ఇంట్లో ఒంటరిగా వదిలేసి ఎవరైనా వెళ్లిపోతారా? ఇది అన్యాయం కదా?”
“మైలార్డ్.. ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఇల్లు ఖాళీ చేసి, తండ్రినొక్కడినే ఇంట్లో వదిలేసి వెళ్లాడో మా క్లయింట్ తన నోరారా చెబుతాడు. ముద్దాయిని మాట్లాడేందుకు అనుమతించండి!”సరేనన్నట్టు జడ్జి తలూపారు.
l l l
బోనులో నిలబడ్డ యువకుడు శంతనకుమార్ జడ్జివైపు తిరిగి చేతులు పైకెత్తి మొక్కి చెప్పసాగాడు.
“సార్! మానాన్న మంచోడు కాదుసార్. ఆయనకు ఎనభై ఏండ్లు వచ్చినా ఆడపిచ్చి సార్! ఆయన నా భార్యపై కన్నేశాడు సార్. ఇప్పుడు స్త్రీలపైన దేశంలో ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి కదండి సార్. అందువల్లనే నా భార్య ‘ఆయన ఇంట్లో ఉన్నంత వరకూ నేను నీతో కాపురం చేయను’ అని తెగేసి చెప్పింది సార్. పైగా ఆయన నా భార్య ఒంటరిగా ఉన్నప్పుడు అఘాయిత్యం చేసేందుకు ఒకసారి ప్రయత్నించాడని కూడా చెప్పింది సార్”
“నో మైలార్డ్! ఇదంతా పచ్చి అబద్ధం. కేవలం ఆ పెద్దాయనమీద నింద వేసేందుకు ఇలాంటివి చెబుతున్నారు. అతని భార్య తనపై అఘాయిత్యం చేసేందుకు ముసలాయన ప్రయత్నించాడని ఊరూరకనే కన్నీళ్లు పెట్టుకుని, నటించి, అసత్య ఆరోపణలు చేసింది. దీన్ని చూసిందెవరూ లేరు. భర్తకు ఆయన కన్నతండ్రిపైనే అనుమాన బీజం నాటి, ఆ తర్వాత దూరం చేయాలని ఆమె ఆడిన నాటకం సార్ ఇది. ఎనభైలో ఉన్న వృద్ధుడు కోడలిపై అఘాయిత్యం చేయబోయాడంటే మీరు నమ్ముతారా? ఆయన తన భార్యలోనూ తల్లిని దర్శించేటటువంటి మహోన్నతుడు సార్! ఎందుకంటే ఆ పెద్దాయన గురించి నాకంటే వేరెవ్వరికీ బాగా తెలీదు సర్”
“అంటే.. మీకంటే వేరెవ్వరికీ బాగా తెలీదా? మీకు తెలిసిందేమిటో! మీకే ఆయన గురించి ఎందుకంత బాగా తెలుసో? ఇందులో ఏదో మతలబు ఉంది” వ్యంగ్యంగా అన్నాడు డిఫెన్స్ లాయర్.
“సర్! నేను సిగ్గు విడిచి చెబుతున్నాను. ఆయనంటే నాకు చాలా అభిమానం, ప్రేమ. కానీ, ఆయన నన్నెప్పుడూ ఆ దృష్టితో చూసేవారు కాదు సార్. వృద్ధాప్యంలో ప్రేమంటే ఏముంటుంది సార్? ఆప్యాయంగా మాట్లాడుకోవడం తప్ప ఇంకేముంటుంది సార్? ఆయన నాతో మాట్లాడేటప్పుడు కూడా చాలా గౌరవంగా పలకరించేవారు. నన్నెప్పుడూ ఏకవచనంతో సంబోధించలేదు. ఆయనెంతో మర్యాద, మన్నన తెలిసిన వ్యక్తి. ఎంతో గొప్పగా బతికారు. ఎంతోమందికి ఆయన గుప్తదానాలు చేశారు. ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకపోతే ఆయనే తీసుకెళ్లి ఆసుపత్రిలో చూపించేవారు. అలాంటి మంచి మనిషిపై నింద వేయడం తగదండీ. పైగా వీళ్లు క్షుద్రులు సార్! వీరికి మర్యాద తెలీదు. సంస్కృతి తెలీదు. నాగరికతా లేదు. కేవలం ప్యాంటు, చొక్కా వేసుకుని తిరుగుతున్నారు. సల్వార్ కమీజులు, చూడీదార్లు వేసుకుని ఫ్యాషనబుల్గా ఉంటున్నారు తప్ప నిజంగా వీరిలో మానవత్వం ఏ కోశానా లేదు. తండ్రిపైనే ఒక నీచమైన, మురికి ఆరోపణ చేస్తున్నాడంటే ఆ కొడుకు ఎంత నికృష్టుడో! నిరపరాధి అయిన మామగారిపైనే నింద వేసే ఆ కోడలి నేపథ్యం ఏమిటో మీరొకసారి అర్థం చేసుకోండి”
“మైలార్డ్! ఈ మాణిక్యమ్మగారికి, మృతుడైన సంజీవరావు గురించి సానుభూతి ఉందనేది తెలుస్తోంది. అందువల్లనే ఈవిడ ఆయన కొడుకు, కోడలు సరిగ్గా ఆయనను చూసుకోలేదని ఉత్తుత్తి ఆరోపణలు చేస్తూ, కేవలం మానసిక బాధతో, ఏది తోచితే అది మాట్లాడుతోంది. ఇలాంటివి ఎలాగూ కోర్టు నమ్మదుకూడా. ఆ పెద్దాయన మరణానికి కన్న కొడుకే కారణమనే విషయాన్ని రుజువు చేసేందుకు తిరుగులేని, బలమైన సాక్ష్యాధారాలు కావాలి. అలాంటివి ఈ కోర్టు ఎదుట ప్రాసిక్యూషన్ ఏమీ ప్రవేశపెట్టలేదని సవినయంగా కోర్టు దృష్టికి తీసుకుని వస్తున్నాను”
“పోలీసులు సాక్ష్యాధారాలను సేకరించారు మైలార్డ్. మా వద్ద డాక్టర్లు ఇచ్చిన నివేదిక కూడా సాక్ష్యంగా రాబోతోంది. ఆయన హైపోైగ్లెసీమియాకు గురై.. అంటే శరీరంలో గ్లూకోజు స్థాయి తగ్గిపోయి, మెదడుకు గ్లూకోజు అందకుండా అంతిమంగా కోమాలోకి వెళ్లి చనిపోయే చాన్స్ ఉందట. ఈ విషయం పాతిపెట్టిన ఆయన శవాన్ని పోస్ట్మార్టమ్ కోసం బయటకు తీయడం వల్లే తెలియబోతుంది. ఏదేమైనా ఈ కేసుకు సంబంధించి మాణిక్యమ్మగారు ఇచ్చిన కంప్లయింటే కీలకం. దీనికి ఈమెను తప్పక అభినందించాల్సిందే. పక్కింట్లో కళ్లెదుటే నేరం జరుగుతున్నా మనకెందుకులే అని చూసి ఊరుకునే రకం కాదావిడ” అన్నారు ప్రాసిక్యూషన్ లాయర్.
“ఆ పెద్దాయన వృద్ధాప్యంలో వచ్చిన అనేక రోగాల సమాహారం వల్ల ఈ లోకంలో నూకలు చెల్లి, చనిపోయాడు. అంతే. ఆయన మెదడుకు గ్లూకోజ్ అందకుండా చనిపోయాడనేది అవాస్తవం. ఇది పోస్ట్మార్టంలో తేలడం అసాధ్యం” అని డిఫెన్స్ లాయర్ అన్నాడు.
కేసు విచారణ మరో రోజుకు వాయిదా పడింది.
l l l
“సంజీవరావు కోమాలోకి వెళ్లి, చనిపోయిన సంఘటన అక్టోబరు 5నాటి రాత్రి జరిగింది. ఆ రోజు నువ్వేం చూశావో కోర్టుకు వివరించు?” అడిగారు ప్రాసిక్యూషన్ లాయర్ గారు, మాణిక్యమ్మను.
“సార్! ఆ రోజు రాత్రి ఎనిమిది గంటలప్పుడు విపరీతమైన వర్షం కురుస్తున్నది. గాలివాన తోడవ్వడంతో, ఊర్లో అంతా విద్యుత్ సరఫరాను ఆపివేశారు. అక్కడక్కడా కరెంటు తీగలు, స్తంభాలు, చెట్లు నేలకూలాయి. షుగర్ పేషెంట్ కావడంతో, వేళకు ఆయన కొడుకు భోజనం తెచ్చి పెట్టాడో లేదోనని సంజీవరావును పరామర్శిద్దామని పక్కింటికి వెళ్లాను. ఆ ఇంట్లో కటిక చీకటి. కరెంటు లేకపోవడంతో నేనే అగ్గిపెట్టె వెతుక్కుని కిరోసిన్ ల్యాంప్ వెలిగించాను. ఆయన అచేతనంగా బెడ్మీద ఒకవైపునకు పడుకొని ఉన్నారు. ఒక చేయి మంచం మీదనుంచి కిందకి వేలాడుతూ ఉంది. ఏం జరిగిందోనని వెళ్లి మొహం మీద నీళ్లు చిలకరించా. కానీ, ఆయన స్పృహలోకి రాలేదు. వెంటనే ఆయన కొడుకైన, ఇక్కడ ముద్దాయిగా బోనులో నిలబడ్డ శంతనకుమార్కు ఫోన్ చేశా. కానీ, అతను చాలా తాపీగా.. ‘మా తండ్రి గాఢనిద్ర పోతుంటారులే’ అని బదులిచ్చాడు.
‘అసలు రాత్రి భోజనం తెచ్చి పెట్టావా?’ అని అడిగాను. ‘ఔను, పెట్టాను’ అని పొడిపొడిగా మాట్లాడాడు. నాతో మాట్లాడటం అతనికి ఇష్టం లేదుమరి. ‘అయితే ఆయన తిన్న గిన్నెలు ఇక్కడ లేవేమిటి?’ అని నిలదీశాను. ‘ఆయన భోం చేసేంతవరకూ అక్కడే ఉండి, వాటిని తీసుకుని వాపసు వచ్చాను’ అని అబద్ధం చెప్పాడు. సాధారణంగా ఎప్పుడూ ఆయన భోజనం చేసేంతవరకూ ఈ కొడుకు వేచి ఉన్న దాఖలాలు నా కంట పడలేదు. ఆయన భోంచేసే టేబుల్మీద కొంచెం అన్నం కింద పడుతుంటుంది. దాన్ని ఎప్పుడూ ఈ కొడుకు శుభ్రం చేసి వెళ్లడు. కానీ, నాకు సందేహం వచ్చి భోజనం టేబుల్మీద చూశాను. అక్కడ భోజనం చేసిన ఆనవాళ్లేమీ కనిపించలేదు. అంటే ఆ రాత్రి ఆయన భోజనం చేయలేదన్నమాట. మరిప్పుడు తండ్రికి స్పృహ తప్పిందంటే వెంటనే వైద్యం చేయించాలి కదా? లేకపోతే ఏదైనా జరగరానిది జరగవచ్చు కదా? అందువల్ల ‘నీకు కారు ఉంది కదా? దాన్ని తీసుకుని వస్తే, సిటీకి తీసుకెళదాం?’ అని శంతన కుమార్ను ఫోన్లోనే వేడుకున్నాను. దానికి అతను కోపంతో నామీద అంతెత్తు ఎగిరాడు. ‘నా తండ్రి బాగోగుల్ని చూసుకునేందుకు నీకేం సంబంధం ఉంది’ అని నన్ను నానా దుర్భాషలాడాడు. వెంటనే ఆ పల్లెటూరిలో ఉండే ఏకైక ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు నా కొడుకును తీసుకుని వెళ్లాను. గతంలో ఇలా శరీరంలో గ్లూకోజ్ స్థాయి పడిపోయినప్పుడు ఆ ఆర్ఎంపీ డాక్టర్ స్లైన్ బాటిల్ పెడితే, సంజీవరావుగారు కోలుకున్నారు. ఆ గత అనుభవాలతో ఇప్పుడుకూడా అలాగే జరిగిందేమోననే ఆదుర్దాతో ఆర్ఎంపీ వైద్యుడిని బతిమాలాడాను. కానీ, తను రానని భీష్మించుకుని కూర్చున్నాడు. ఈ ముద్దాయి, ఆ ఆర్ఎంపీ డాక్టర్తో మాట్లాడి, తన తండ్రి గురించి వెళ్లవద్దని చెప్పి, ఏదో గూడుపుఠాణి చేశాడు. ఎందుకంటే, ఆ ఆర్ఎంపీకూడా ఈ ముద్దాయి భార్యకి పిన్ని కొడుకు అవుతాడు.
సాధారణంగా ప్రతిరోజూ కొడుకు తండ్రికోసం తెచ్చిన భోజనం బ్యాగును బయట గేటువద్ద విసిరేసి, వెంటనే వెనుదిరిగి వెళ్లిపోతుంటాడు. తర్వాత ఇన్సులిన్ తీసుకుని, ఓ ఏడెనిమిది నిమిషాలకు పెద్దాయన భోజనం మొదలు పెడతారు. ఆ భోజనం సంచికోసం ప్రతిరోజూ ఎదురు చూస్తూ పడిగాపులు పడే పెద్దాయన తను భోజనం ముగించాక ఖాళీ క్యారియర్లను, తన టేబుల్ మీద పెట్టుకుని ఉంటాడు. మళ్లీ తర్వాతి రోజు ఉదయం ఆ పెద్దాయన తనకు చేదోడువాదోడుగా ఉండాలని పెట్టుకున్న పనిమనిషి వచ్చి, ఇంటి ముందంతా కసువు ఊడ్చి, టాయ్లెట్లోని డ్రమ్ములో నీళ్లు నింపి, రాత్రి భోజనం చేసిన గిన్నెల్ని కడిగి పెట్టి వెళుతుంది. ఆ పనిమనిషికి నెలకు రెండువేల రూపాయల జీతం కూడా సంజీవరావు గారే ఇస్తుంటారు. ఆ అక్టోబరు 5వ తేదీ రాత్రి పెద్దాయన గనుక నిజంగా కొడుకు తెచ్చిన భోజనం తినివుంటే, అక్కడ ఖాళీ గిన్నెలు, క్యారియర్లు ఉండేవి మరి. కానీ అక్కడ అవేవీ లేవు. అంటే భోజనం తేలేదని అర్థం. వాస్తవానికి ఆ రోజు రాత్రి జరిగిందేమిటి? ఆయనకు తను భోజనం తీసుకొచ్చానని, ఇక ఇన్సులిన్ వేసుకొనమని ఆ కొడుకు తండ్రితో చెప్పాడు. తీరా ఆయన ఇన్సులిన్ వేసుకున్నాక ‘అరరే.. పొరపాటున ఖాళీ గిన్నెలు ఉన్న బ్యాగు తెచ్చాను. మళ్లీ వెంటనే వెళ్లి భోజనం తెస్తాను’ అని చెప్పి, ఇంటికెళ్లిన కొడుకు తిరిగి భోజనం తీసుకుని రాలేదు. కొడుకు తెచ్చే భోజనం కోసం వేచి చూస్తున్న పెద్దాయనకు కడుపు ఖాళీగా ఉండటం వల్ల, ఆ ఇన్సులిన్ ప్రభావం వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయి పడిపోయి కోమాలోకి వెళ్లాడు”
“నో యువరానర్. ఆ రోజు రాత్రి కొడుకు తన తండ్రికి భోజనం తెచ్చిపెట్టిన సంగతిని గుడిసెలో ఉండే హమాలీ రంగయ్య చూశాడు. రంగయ్యను సాక్ష్యంగా ప్రవేశపెడుతున్నాం”
“ఏంటి రంగయ్యా! ఆ రోజు నువ్వేం చూశావో చెప్పు”
“ఈ బాబు తన తండ్రికి భోజనం తెచ్చిపెట్టిన క్యారియర్ బ్యాగును వెనక్కి ఇంటికి తీసుకెళుతున్నప్పుడు నేను చూశానండీ”
ఈ సాక్ష్యం తప్పకుండా తనకు బాగా పనికొస్తుందని చెప్పి, శంతనకుమార్ నవ్వుకుంటున్నాడు.
“భోజనం తీసుకొచ్చిన గిన్నెల్ని బ్యాగులో వెనక్కు తీసుకెళుతున్నప్పుడు చూశావు, అంతేనా?”
అడిగాడు ప్రభుత్వ లాయర్.
“అంతేనండీ!”
“కానీ, తన కొడుకు తీసుకొచ్చి పెట్టిన భోజనాన్ని ఆ పెద్దాయన తింటున్నప్పుడు మాత్రం నువ్వు చూడలేదు కదా?”
“అవునండీ.. అది నేనయితే చూళ్లేదు” అన్నాడు రంగయ్య.
“అందువల్ల.. ఇక్కడ జరిగిందేమంటే ఆ రోజు శంతన కుమార్ భోజనం తీసుకుని రాకుండా, ఖాళీ క్యారియర్లను తెచ్చి, భోజనం తెచ్చానని తన తండ్రితో అబద్ధం చెప్పాడు. ఆయన ఇంకెలాగూ కొడుకు భోజనం తెచ్చాడని ఇన్సులిన్ను సిరంజీతో శరీరంలోకి ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత ఈ ధూర్తుడైన కొడుకు తన తండ్రితో భార్య భోజనం సర్దిపెట్టిన క్యారియర్ బదులు పొరపాటున ఖాళీ క్యారియర్లను తెచ్చానని, వెంటనే వెళ్లి మరో క్యారియర్లో భోజనం తెస్తానని చెప్పి ఇంటికెళ్లాడు. కానీ, అలా వెళ్లినవాడు ఎంతసేపటికీ తిరిగి రాలేదు. ఇక్కడ భోజనం కోసం ఎదురు చూసీ చూసీ ఈయన ఇన్సులిన్ ప్రభావంతో శరీరంలో గ్లూకోజ్ స్థాయి కోల్పోయి, మెదడుకు గ్లూకోజ్ అందకుండా, స్పృహతప్పి పడిపోయారు. పైగా ఇంట్లో సంజీవరావు పడుకునే బెడ్ పక్కన గూటిలో ఉండాల్సిన పంచదార డబ్బాకూడా విచిత్రంగా మాయమైపోయింది. ఆ బాక్సు ఎంత వెతికినా ఇంట్లో ఎక్కడా కనిపించలేదు. ఇంక ఆ ఖాళీ ఇంట్లో తినేందుకు ఏమీలేవు. ఆ పంచదార డబ్బా హఠాత్తుగా ఎందుకు మాయమైంది? అంటే ‘ఇదంతా చాలా తెలివిగా చేసిన హత్య’ అని ముమ్మాటికీ చెప్పవచ్చు యువర్ ఆనర్!”
“నో.. ఇదంతా కట్టుకథ.. అసలు నేను ఆ రోజు భోజనం తెచ్చిచ్చాను. మా నాన్నగారు తిన్నారు. తిన్నాక నేను ఖాళీ క్యారియర్ బాక్సులను ఇంటికి తీసుకెళ్లాను. ఆ పంచదార డబ్బాలను ఆయన ఎక్కడైనా పడేసుకుని ఉండవచ్చు” అన్నాడు శంతనకుమార్.
“కానీ, పోస్ట్మార్టం నివేదికలో బ్రెయిన్కు గ్లూకోజ్ అందకుండానే చనిపోయాడని కచ్చితంగా ఏమీ తేల్చలేదు” అంటూ అప్పుడే పోలీసులు అందించిన, వైద్యుల నివేదికను చూసిన జడ్జి గారు చెప్పారు.
“కాబట్టి, ఈ మాణిక్యమ్మగారు చెప్పేదంత కట్టుకథ. నా క్లయింట్ నిర్దోషి ” అని అన్నాడు డిఫెన్స్ లాయర్ ఇదే అదనుగా.
విచారణ మళ్లీ వాయిదా పడింది.
ఆ పెద్దాయన వృద్ధాప్యంలో వచ్చిన అనేక రోగాల సమాహారం వల్ల ఈ లోకంలో నూకలు చెల్లి, చనిపోయాడు. అంతే. ఆయన మెదడుకు గ్లూకోజ్ అందకుండా చనిపోయాడనేది అవాస్తవం. ఇది పోస్ట్మార్టంలో తేలడం అసాధ్యం” అని డిఫెన్స్ లాయర్ అన్నాడు. కేసు విచారణ మరో రోజుకు వాయిదా పడింది.
l l l
“మైలార్డ్! చనిపోయిన సంజీవరావుకు ఎనభై సంవత్సరాలు. ఈ వయసులో ఎవరికైనా మృత్యువు సహజంగానే దాపురిస్తుంది. ఎంతోమంది డబ్బున్నవాళ్లు, ఆధునిక వైద్యం అందుబాటులో ఉన్నవారుకూడా మన కళ్లెదుటే మరణించారు. వారికి డబ్బుకుగానీ, వైద్యానికిగానీ లోటు లేదు. కాబట్టి, ఈ కేసులో శంతనకుమార్ దోషమేమీ లేదు. నిజానికి ఆ రాత్రి వృద్ధుడైన సంజీవరావు స్పృహ కోల్పోయినప్పుడు సకాలంలో వైద్యుడి వద్దకు తీసుకెళ్లలేదనే నెపంతోనే, ఆయన మరణానికి అతని కొడుకైన నా క్లయింట్ ముందుగానే పథకం వేసి, తన తండ్రిని మృత్యువుకు అప్పగించాడని చెప్పలేం. దాన్నిబట్టే ఆయనను దోషిగా నిర్ధారించలేం. పైగా అది వర్షపు రాత్రి. సమీపంలోని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే ఎనభై కిలోమీటర్లు ప్రయాణించాలి. అందువల్ల తెల్లవారాక వెళదామని అనుకోవడంలోనూ తప్పులేదు. వారి నాన్నకు తలెత్తిన సమస్య ప్రాణాంతకమనే జ్ఞానం కూడా పెద్దగా నా క్లయింటుకు లేదు” అన్నాడు డిఫెన్స్ లాయర్.
అనేక దఫాలుగా సుదీర్ఘ విచారణలు జరిగాయి. కోర్టుముందు పెట్టేందుకు ఇంకేమీ సాక్ష్యాధారాలు దొరకలేదు పోలీసులకు. చివరకు జడ్జి తన తీర్పు చదవసాగాడు.
“సంజీవరావు మరణానికి వృద్ధాప్యంతోపాటు అనేక వ్యాధులు తోడయి ఉండవచ్చు. ముద్దాయి శంతనకుమార్ ఉద్దేశపూర్వకంగానే, ఆ రాత్రి ఇన్సులిన్ తీసుకున్న తండ్రికి సకాలంలో భోజనం అందించకపోవడం వల్లనే ఆయన చనిపోయాడనేందుకు తగిన సాక్ష్యాధారాలు లేవు. అందువల్ల ఆ విషయం కచ్చితంగా అలాగే జరిగిందని చెప్పలేం” అని అన్నారు.
“తన తండ్రి చావుబతుకుల మధ్య కోమాలో కొట్టుమిట్టాడుతున్న విషయాన్ని తెలుసుకున్నా స్పందించని కొడుకుది తప్పు కాదా యువరానర్? ఎలాగూ వృద్ధుడయ్యాడని, ఈరోజో రేపో చనిపోతాడనీ, ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఉండటం క్రిమినల్ నెగ్లిజెన్స్ కిందకి రాదా? నిందితుడి మనసులో పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన కుట్రకు భౌతికంగా తగిన సాక్ష్యాధారం లేనందువల్ల అతడిని విడిచి పెట్టడం సరైంది కాదు. ఈ కేసులో కేవలం కొడుకే కాదు, ఆర్ఎంపీ డాక్టర్, కోడలుకూడా ఆ పెద్దాయన మరణానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. వాళ్లందరూ నిజంగా దోషులే. ఈ దేశంలో వృద్ధుల దుస్థితిని పట్టించుకునేదెవరు?” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది
మాణిక్యమ్మ.
జడ్జిగారు తీర్పు చెప్పేటప్పుడు అడ్డు పడకూడదని అందరూ మాణిక్యమ్మను వారించారు.
జడ్జి తన తీర్పును కొనసాగించారు.
“కాబట్టి.. సంజీవరావు మరణం కేవలం ఒక విషాదకరమైన, ఎవరూ తప్పించలేని సంక్షోభం. పైగా సంజీవరావుకు ఉన్నది ఒక్కడే కొడుకు. అందువల్ల ఆస్తికోసం ఎనభై ఏండ్లు దాటిన తండ్రిని చంపాల్సిన అవసరం కూడా ఆ కొడుక్కు లేదు. ఎందుకంటే ఎలాగూ తండ్రి చనిపోయాక ఆ ఆస్తి కొడుకుకే చెందుతుంది. కాబట్టి, ఈ కారణాల రీత్యా ముద్దాయిని నిర్దోషిగా తేల్చి విడిచి పెడుతున్నాం. కానీ, కోమాలో ఉన్న తండ్రిని సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లి ఉంటే బాగుండేది” అని జడ్జిగారు తీర్పు పాఠాన్ని పూర్తిగా చదివి వినిపించారు.
“సార్.. నా మాట ఓసారి వినండి. ఇక్కడ ఆస్తికోసం తండ్రిని కొడుకు చంపాడనేది కాదు నా అభియోగం. తండ్రికి రోజూ కూడు తెచ్చి పెడుతూ ఆయన బాగోగులు చూసుకోవడం కష్టమనీ, ముసలివాడు చావకుండా ఇంకా ఎందుకు బతికి ఉన్నాడనే కారణంతోనే, ఆయనకు మరణం ఆసన్నం కావడానికి ముందుగానే కుట్ర పూరితంగా చంపారని నేను చెప్పదలచుకున్నాను. అందుకే ఆ పెద్దాయనను భోజనానికి ముందు ఇన్సులిన్ తీసుకునేలా పురికొల్పి, తర్వాత ఆయనకు భోజనం పెట్టకుండా, ఆయనను కోమాలోకి వెళ్లేలా చేసి, ఆ తర్వాత పట్టించుకోకుండా వదిలేయడంతోనే ఆయన చనిపోయాడు. ఇది కూడా హత్యే. ఎనభై ఏండ్ల వ్యక్తిని చంపినా, ఏడాది పసికందును చంపినా మానవహత్య హత్యకాకుండా పోతుందా? ముసలివాళ్లు బతకడం వ్యర్థమనీ, వారిని చావుకు వదిలేయడం మేలని భావించి, సాక్షాత్తు సొంత కొడుకు కన్నతండ్రి కోమాలో ఉన్నప్పుడు సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లకపోవడం నేరమే కదా? కన్నకొడుకులు, కూతుళ్లే వృద్ధుల చావును కోరుకుంటే, ఎవరి ఆసరా లేకుండా ముసలివాళ్లు ఈ దేశంలో బతికేది ఎలా? ఇదీ హత్యే కాదా? మీరందరూ దీని గురించి కాస్త ఆలోచించండి.. కోర్టుల సంగతి వదిలేయండి! నిజంగానే నిందితుడు ఈ కేసులో నిర్దోషేనా? అతనికెలాంటి నేరపూరిత మనస్తత్వం లేదా? వృద్ధుడికి చాకిరీ చేయాల్సి వస్తున్నదని కన్నకొడుకు తండ్రి చావును ఇక్కడ కోరుకోలేదా? మీరే ఆలోచించండి! ఇదీ హత్యే కదా?” అని కోర్టు హాలు దద్దరిల్లేలా మాణిక్యమ్మ అరిచి అరిచి, స్పృహ తప్పి పడిపోయింది. మరోవైపు ఈ కేసులో నిర్దోషిగా తేలడంతో చిద్విలాసంగా నవ్వుతూ బయటకు వచ్చిన శంతనకుమార్, తన లాయర్కు ఒక పెద్ద పార్టీ ఏర్పాటు చేశాడు.
‘సుశోభ’ కలంపేరుతో బి.వి.గిరిజ రచనలు చేస్తున్నారు. తనది అనంతపురం జిల్లాలోని పుల్లీకుంట అనే కుగ్రామం. చిన్నప్పటి నుంచీ అనేక ఒడుదొడుకులకు గురవుతూ బీఎస్సీ వరకు చదివారు. బెంగళూరులో పెద్దమ్మ, పెదనాన్నల వద్ద ఉంటూ, వారికి సేవలు చేస్తూ, అతి తక్కువ వేతనాలకే చిన్నా చితక ప్రైవేటు ఉద్యోగాలు చేశారు. కరుణార్ద్ర భరితమైన రచనలు చదవడానికి ఇష్టపడేవారు. కన్నడ, తెలుగు సాహిత్యాలతో కొద్దిపాటి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే కథలు రాయడం మొదలుపెట్టారు. ఇప్పటివరకూ ఐదు కథలు రాశారు. వృద్ధులకు సరైన భద్రత, భరోసా లేని సమాజాన్ని ప్రశ్నిస్తూ ‘ఇదీ హత్యే కాదా?’ అనే కథను రాశారు. గిరిజ ఎంతోమంది వృద్ధుల దీనగాథలు విన్నారు. వారి కష్టాలను కళ్లారా చూశారు. వాటన్నింటినీ ఈ కథలో హృద్యంగా ఆవిష్కరించారు.
-బి.వి.గిరిజ, 8985038173