న్యూఢిల్లీ : రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. చమురు ధరల పెంపుపై చర్చకు కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. పెట్రోలు లీటర్కు రూ. 100, డిజీల్ లీటర్కు రూ. 80 చొప్పున పెరిగిందన్నారు. ఎల్పీజీ ధరలు కూడా పెరగడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎక్సైజ్ డ్యూటీ పేరిట రూ. 21 లక్షలు వసూలు చేశారని తెలిపారు. పెరిగిన ధరలతో అన్ని వర్గాల ప్రజలతో పాటు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఖర్గే పేర్కొన్నారు.
సభ్యుల ఆందోళనల మధ్య సభను ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు తాను ఎలాంటి చర్యలు తీసుకోదలుచుకోలేదని వెంకయ్య తెలిపారు. ప్రతి ఒక్కరూ సభా నియమాలు పాటించి, సహకరించాలని సభ్యులకు ఆయన విజ్ఞప్తి చేశారు.