ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరోసారి కలకలం రేపుతున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. రోజువారీ కరోనా కేసుల నమోదు ఐదు నెలల గరిష్ఠానికి చేరింది. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 10,141 కరోనా కేసులు, 38 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,19,727కు, మరణాల సంఖ్య 52,478కు చేరింది.
కాగా, గత 24 గంటల్లో 6,013 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 20,68,044కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 97,983 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది.
మరోవైపు ఔరంగాబాద్లోని సంభాజినగర్ కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మార్చి 11 నుండి ఏప్రిల్ 4 వరకు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు విధిస్తున్నట్లు మంత్రి ఏక్నాథ్ షిండే తెలిపారు. అలాగే వారంతర రోజుల్లో పూర్తి లాక్డౌన్ అమలు చేస్తామని చెప్పారు. పాఠశాలలు, కళాశాలలు, వివాహ మందిరాలు వంటివి మూసి ఉంటాయని వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.