విశ్రాంత ఉద్యోగులే లక్ష్యంగా సైబర్నేరగాళ్లు వల వేస్తున్నారు.. బీమా పాలసీలు, క్రెడిట్, డెబిట్ కార్డులకు సంబంధించి వృద్ధులైతే ఈజీగా మోసం చేయవచ్చనే ఆలోచనతో మోసాలకు పాల్పడుతున్నారు.. ఇటీవల ఇన్సూరెన్స్ పేరుతో మోసాలు చేసే కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. అందులో ఎక్కువగా విశ్రాంత ఉద్యోగులు, మహిళలే ఉంటున్నారు. ఎప్పుడో ఇన్సూరెన్స్ తీసుకొని.. వదిలేసిన వాళ్లకు సంబంధించిన పాలసీ నంబర్లు సేకరించి మోసం చేయడం ఒక ఎత్తైతే.. ప్రస్తుతం సాఫీగా సాగుతున్న పాలసీదారులను ఇంకో రకంగా.. కొత్తగా పాలసీలు ఇప్పించి వాళ్లను బుట్టలో వేసి మరో రకంగా మోసం చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఏడాది కాలంగా ఢిల్లీ, కోల్కత్తా వంటి ప్రాంతాల్లో కాల్సెంటర్లు మూతపడ్డాయి. ఇప్పుడిప్పుడే సైబర్నేరగాళ్లు గతంలో నిర్వహించిన కాల్సెంటర్లు సైతం తెరుచుకుంటున్నాయి. దీంతో ఇన్సురెన్స్, జాబ్ ఫ్రాడ్ మోసాలు పెరుగుతున్నాయని పోలీసులు భావిస్తున్నారు.
లక్ష రూపాయల ప్రీమియంతో ఇన్సూరెన్స్ తీసుకొని.. కొన్నాళ్లు ప్రీమియం చెల్లించి.. ఈ తర్వాత చెల్లించకుండా ఆ విషయాన్ని కొందరు మరిచిపోతారు.. ఇలాంటివారినే సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు.. ఇందులో విశ్రాంత ఉద్యోగులు, మహిళలను లక్ష్యంగా చేసుకున్నారు. ఇందుకు ఆయా ఇన్యురెన్స్ కంపెనీల నుంచి వారికి సంబంధించిన డాటాను కొనుగోలు చేస్తారు..
అలాగే.. కొన్ని రోజులు ప్రీమియం చెల్లించి, మధ్యలో ఆగిపోయిన వారికి ప్రీమియం చెల్లించాలని కొన్ని ఏజెన్సీలు ఫోన్లు చేస్తుంటాయి. అక్కడి నుంచి కూడా డాటాను కొనుగోలు చేస్తుంటారు. ఇలా సేకరించిన డాటాతో బాధితుల వివరాలు తీసుకొని.. వారికి ఫోన్చేసి బుట్టలో వేస్తుంటారు. ఇందులో వాళ్ల వయస్సును కూడా తెలుసుకునే అవకాశం ఉండటంతో, మీ వయస్సుకు ఇంత బోనస్ వస్తుందని, అందుకు తాము మరో బ్రాంచ్కి ఫైల్ పంపించి మాట్లాడాల్సి ఉంటుందంటూ బాధితులను మాటలతో మాయ చేస్తుంటారు. అలాగే కొత్తగా పాలసీలు ఇప్పించి, వాటికి కూడా వెంటనే బోనస్ వస్తుందంటూ నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు. బోనస్ భారీగా ఆశ చూపిస్తూ, మొదటగా తక్కువ మొత్తంలో రిజిస్ట్రేషన్ ఫీజు అడుగుతారు.. ఆ తరువాత బోనస్ త్వరగా వచ్చేందుకు జీఎస్టీ, ఆదాయపన్ను, మెడికల్ సర్టిఫికేట్.. ఇలా పలురకాలైన పన్నులు చెల్లించాలంటూ నమ్మిస్తూ డబ్బులు వసూలు చేస్తారు… అప్పటికే ఒకటి రెండు లక్షలు వసూలు చేస్తారు. బోనస్తో పాటు మీరు చెల్లించే డబ్బు మీకు తిరిగి వస్తుందని నమ్మిస్తారు. ఇక అక్కడి నుంచి మీ ఫైల్ ఢిల్లీకి.. అక్కడి నుంచి ఆర్బీఐకి వెళ్లి ఆగింది.. అక్కడ ఫలానా ట్యాక్స్ చెల్లించాలంటూ ఆర్బీఐ పేరుతో మరో ట్యాక్స్ చెప్పి డబ్బు వసూలు చేస్తారు. ఇలా.. ఆశ పెడుతూ లక్షలు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నారు.
సైబర్నేరగాళ్లు మొద ట్లో తియ్యగా మాట్లాడి నిజమైన బ్యాంకు అధికారులుగా నమ్మిస్తారు. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే సమయంలో ఏ నిబంధనలు ఉంటా యో.. ఆ నిబంధనలకు లోబడి ఆయా సంస్థలు క్లెయిమ్లు చెల్లిస్తుంటాయి. అయితే.. బోనస్ అంటూ బురిడీ కొట్టించేందుకు సైబర్నేరగాళ్లు ప్రయత్నిస్తుంటారు. ఇక్కడ మీరు చెల్లించే డబ్బంతా బ్యాంకు ఖాతా లో బోనస్తో పాటు జమ అవుతుందంటూ నమ్మిస్తుంటారు. నిజమే కావచ్చనే భ్రమలో కొందరు ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్లో మాట్లాడి.. మీ క్లెయిమ్లు, బోనస్ ఫైనల్ చేసుకోవద్దు. సంబంధిత బ్యాంకులకు వెళ్లడం మంచిది. ఢిల్లీ, కోల్కత్తా ప్రాంతాల నుంచి మాట్లాడే వారి మాటలు అసలు నమ్మకండి.. కుటుంబ సభ్యులు, స్నేహితులతో చర్చిం చి నిర్ణయం తీసుకోవడం ముంచింది. – గంగాధర్, సైబర్క్రైమ్ ఇన్స్పెక్టర్