అభివృద్ధి పథంలో గోగ్యనాయక్తండా
పల్లె ప్రగతితో ఇబ్బందులు దూరం
తాగునీటి సమస్య పరిష్కారం
అన్ని విధాలా గ్రామాభివృద్ధికి చర్యలు
ప్రతి ఇంటికీ మరుగుడొడ్డి, ఇంకుడు గుంత నిర్మాణం
కులకచర్ల, జూలై 15: అది ఒక మూరుమూల గ్రామం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 500 జనాభా ఉన్న గ్రామాలను సీఎం కేసీఆర్ పంచాయతీలుగా ఏర్పాటుచేశారు. దీంతో పెద్ద పంచాయతీ నుంచి విడిపోయిన తండా. గ్రామంలో సుమారుగా 566 మంది జనాభా, 350 మంది ఓటర్లు, 120 కుటుంబాలు ఉన్నాయి. కులకచర్ల మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుగ్రామం. నూతన పంచాయతీగా ఏర్పడిన తర్వాత పల్లె ప్రగతి కార్యక్రమంలో స్థానిక సమస్యలు పరిష్కరిస్తూ, అభివృద్ధి పథంలో గోగ్యనాయక్తండా దూసుకుపోతున్నది.
తోటి గ్రామాలతో పోటీ
గోగ్యనాయక్తండా పంచాయతీ అభివృద్ధిలో తోటి గ్రామాలతో పోటీ పడుతున్నది. అన్నింటిలో వెనుకబడి ఉన్న తండా పంచాయతీగా మారడంతో స్థానిక సమస్యలు పరిష్కారమవుతున్నాయి. రాష్ట్రంలో పల్లె ప్రగతితో నిర్వహిస్తున్న అభివృద్ధి పనుల్లో ఆదర్శంగా నిలుస్తున్నది.
అన్ని విధాలుగా అభివృద్ధికి కృషి
గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు సర్పంచ్ రవినాయక్ కృషి చేస్తున్నారు. యువ సర్పంచ్గా గ్రామంలోని సమస్యలు తెలుసుకుని, పెద్దల సహకారంతో పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. పల్లె ప్రగతిని ఉపయోగించుకుని పాలకవర్గంతో కలిసి అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పల్లె ప్రగతిలో భాగంగా వైకుంఠధామం, డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనం, నర్సరీ, కల్లాలు, పశువుల షెడ్లు, మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం, మట్టి రోడ్లు, వీధి దీపాల ఏర్పాటు, రోడ్లకు ఇరువైపులా మొక్కల పెంపకం వంటి వివిధ రకాల అభివృద్ధి పనులు నిర్వహించి, సమస్యలు లేని పంచాయతీగా తీర్చిదిద్దారు.
పరిసరాల పరిశుభ్రతకు చర్యలు
గోగ్యనాయక్తండాలోని రెండు తండాల్లో పరిసరాల పరిశుభ్రతకు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామంలో మురుగు నీటి కాల్వలు శుభ్రంచేశారు. ప్రతి రోజూ గ్రామంలో పారిశుధ్య పనులు చేపడుతున్నారు. గ్రామం శుభ్రంగా ఉండేందుకు ట్రాక్టర్తో ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించిన డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. పంచాయతీ పరిధిలో తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించారు. గ్రామంలో ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా పరిసరాల పరిశుభ్రతకు కృషిచేస్తున్నారు.
తప్పిన దోమల ముప్పు
గ్రామంలో పల్లె ప్రగతి ద్వారా ప్రతి వార్డులో పరిసరాలు పరిశుభ్రం చేయడంతో పాటు మురుగు నీటి కాల్వలను శుభ్రం చేస్తున్నారు. పంచాయతీ ఆధ్వర్యంలో నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టడంతో ప్రస్తుతం దోమలు, ఈగలు పెరుగకుండా చేశారు. పల్లె ప్రగతితో స్వచ్ఛతా కార్యక్రమం ద్వారా పరిసరాలను పరిశుభ్రంగా చేయడంతో దోమల నుంచి రక్షణ పొందుతున్నారు.
మిషన్ భగీరథతో తప్పిన ఇబ్బందులు
నూతన పంచాయతీగా ఏర్పడక ముందు గ్రామంలో నీటి సమస్య అధికంగా ఉండేది. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లాలు కల్పించడంతో తాగునీటి సమస్య పరిష్కరించారు. రోజూ తండాలోకి మిషన్ భగీరథ నీటిని అందజేస్తున్నారు. పరిశుభ్రత పాటించడంతో సీజనల్ వ్యాధుల నుంచి కూడా రక్షణ కలిగింది. గ్రామంలో వైద్యం అందుబాటులో ఉంది. గ్రామస్తుల ఆరోగ్య పరిస్థితులను ప్రతి రోజూ ఆశాకార్యకర్త తెలుసుకుని మండల వైద్యాధికారులకు సమాచారం అందిస్తున్నారు. అనారోగ్యానికి గురైతే వెంటనే వైద్యం చేయడంతో పాటు సమీపంలో ఉన్న ఆస్పత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు.
వైకుంఠధామం, డంపింగ్ యార్డు పనులు పూర్తి
పల్లె ప్రగతిలో భాగంగా గోగ్యనాయక్తండాలో వైకుంఠధామం, డంపింగ్యార్డు పనులు పూర్తి చేశారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేసేందుకు అవగాహన కల్పించారు. దీంతో రోజూ చెత్తను సేకరించిన డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు.
పల్లె ప్రకృతి వనం ఏర్పాటు
గ్రామంలో నర్సరీతోపాటు పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఆదేశించడంతో గ్రామ సమీపంలో పల్లె ప్రకృతి వనాన్ని నిర్మించారు. పల్లె ప్రకృతి వనంలో సుమారు 2వేల మొక్కలు నాటి, వాటిని సంరక్షిస్తున్నారు. ఇందులో పూలు, పండ్ల మొక్కలు పెంచుతున్నారు. ప్రజలకు ఆహ్లాదాన్ని అందించే మొక్కలను పెట్టి వాటిని సంరక్షిస్తున్నారు.
గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాం
పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పంచాయతీలో ఇద్దరు పారిశుధ్య కార్మికులను నియమించి, ప్రతి రోజూ పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ పథకాలను ప్రజలకు పూర్తిస్థాయిలో అందేలా చూస్తున్నాం. ఆదర్శగా గ్రామంగా చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో మావంతు కృషిచేస్తాం. –శివకుమార్, పంచాయతీ కార్యదర్శి గోగ్యానాయక్తండా