పూడూరు, జూలై 23: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పేర్కొన్నారు. అందుకుగాను వచ్చే నెల 10వ తేదీన పరిగిలోని బృందావన్ గార్డెన్లో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని సంబంధిత శాఖ అధికారులు నిర్వహిస్తునట్లు ఆయన తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో ఎంపీపీ మల్లేశం అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మహేశ్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనుల కోసం అధికారులు ఆయా ప్రాంతాలను పరిశీలిస్తున్నారన్నారు. దీంతో పరిగి డివిజన్లో లక్ష ఎకరాలకు సాగు నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజాభిప్రాయంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొని సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. రైతుబీమా కొందరు దుర్వినియోగం చేస్తున్నారని, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వ్యవసాయధికారులు, పంచాయతీ కార్యదర్శులు స్థానిక నాయకులు పరిశీలించి రైతుబీమాలో అక్రమాలు జరుగకుండా చూ డాలన్నారు. ఈ నెల 26 నుంచి అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. విద్యుత్ అధికారులు సమస్యల పరిష్కారం చేయడంలేదని సర్పంచ్లు అనంతరెడ్డి, శ్రీధర్గుప్తా, ఆంజనేయులు, ఎంపీటీసీలు సల్మాబేగం, సురేందర్, లక్ష్మణ్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఎమ్మెల్యే, ఎంపీపీ మల్లేశంలో జోక్యం చేసుకుని కురుస్తున్న వర్షాలతో రైతులు, గృహాలకు విద్యుత్ సమస్య రాకుండా చూడాలని ఆదేశించారు. మండలంలోని రేగడి మామిడిపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డులో కల్వర్టు నిర్మాణానికి రూ.60 లక్షలు, పుడుగుర్తి వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.కోటి, ఎన్కెపల్లి వద్ద వాగుపై కల్వర్టుకు రూ.25 లక్షలు, కడ్మూర్ వాగుపై కల్వర్టుకు రూ.75లక్షల నిధులతో ప్రతిపాదనలు పంపగా మంజూరైనట్లు అధికారులు, ఎమ్మెల్యే తెలిపారు.
పీఆర్, ఆర్అండ్బీ రోడ్ల ఇరుపక్కలా పొదలు పెరిగి ప్రయాణికులకు ప్రమాదాలు జరుగుతున్నట్లు సొసైటీ చైర్మన్ సతీశ్రెడ్డి సభలో పేర్కొనగా, ఎంపీపీ, జడ్పీటీసీ మేఘమాల స్పందిస్తూ రోడ్ల పక్కల పొదలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. మండలంలో 8 ఆయా, టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అంగన్వాడీ మండల సూపర్వైజర్ సభలో సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. ఎస్సీ, బీసీ విద్యార్థులు ఈ నెల 31 లోపు ఉపకార వేతనాలకు దరఖాస్తులు చేసుకోవాలని ఆయా హాస్టల్ వార్డన్లు సభలో తెలిపారు. పూడూరులో మంచి నీటి ట్యాంక్ను పరిశుభ్రంగా ఉంచడంలేదని ఎంపీటీసీ సల్మాబేగం పేర్కొనగా, ఎమ్మెల్యే స్పందిస్తు అధికారుల గ్రామాల్లోని నీటి ట్యాంక్లను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8 నుంచి 10 తరగతి విద్యార్థులకు ఇంగ్లిష్ డిక్షనరీలను ఉచితంగా అందజేయనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. వైకుంఠధామాలను త్వరగా పూర్తి చేయాలని సర్పంచ్లకు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మహిపాల్రెడ్డి, సర్పంచ్లు బుచ్చన్న, నవ్యరెడ్డి, రామస్వామి, ఎంపీటీసీలు నాగమణి, ఆరిఫ్, ఎంపీడీవో ఉష, అధికారులు పాల్గొన్నారు.
సాగునీటి కష్టాలు తీరుతాయి: ఎంపీపీ
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో సాగు నీటి కష్టాలు తీరుతాయని ఎంపీపీ మల్లేశం తెలిపారు. శుక్రవారం పూడూరు మండల కేంద్రంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల నమూనాను నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి ఎంపీపీ పరిశీలించారు. ప్రస్తుతం మండలంలోని గొంగుపల్లి, కండ్లపల్లి, కత్తపల్లి, సిరిగాయపల్లి, కెరవెళ్లి, దండుగడ్డ, తిర్మపూర్, పెద్ద ఉమ్మెంతాల్తో పాటు మరికొన్ని గ్రామాల్లో కెనాల్ నిర్మాణం పరిశీలనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. పరిగి డివిజన్లోని లక్ష్మీదేవిపల్లి వద్ద నిర్మించాలా లేదా ఉదండపూర్ వద్ద నిర్మించాలా అన్న ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. దీనిపై వచ్చే నెల 10న పరిగిలోని బృందావన్ గార్డెన్లో ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందని, రైతులు హాజరుకావాలని ఎంపీపీ కోరారు.