కులకచర్ల, మే 23 : ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ పౌసుమి బసు అన్నారు. ఆదివారం కులకచర్ల మండల కేంద్రంలోని పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని వసతులు సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. దవాఖాన ఆవరణ, పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడాలని వైద్యాధికారి డాక్టర్ మురళీకృష్ణను ఆదేశించారు. దవాఖానకు వచ్చిన మెడిసిన్ను ఒక గదిలో భద్రపర్చాలని, ఎక్కడ పడితే అక్కడ పెట్టవద్దన్నారు. వృథాగా ఉన్న మెడిసిన్ను తిరిగి జిల్లాకు పంపించాలన్నారు. రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. దవాఖాన నుంచి బయలు దేరిన కలెక్టర్ ఆ మార్గంలో ఉన్న మురుగునీటి కాల్వను పరిశీలించారు. మురుగునీటి కాల్వ మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేసి శుభ్రంగా ఉండేలా చూడాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు.
జ్వర సర్వేను పరిశీలించిన కలెక్టర్..
కులకచర్ల మండల కేంద్రంలో కొనసాగుతున్న జ్వర సర్వేను కలెక్టర్ పౌసుమి బసు పరిశీలించారు. ఇండ్ల వద్దకు వెళ్లి ప్రజలతో మాట్లాడారు. ఏమేమి ఆడుగుతున్నారంటూ ఆరా తీశారు. వ్యక్తికి పల్స్ రేటు ఎంత ఉందో తెలుసుకుంటున్నారా అని వైద్య సిబ్బందిని ప్రశ్నించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన..
కులకచర్ల మండల కేంద్రంలోని పీఏసీఎస్, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పౌసుమి బసు పరిశీలించారు. లారీలు సక్రమంగా రాక పోవడంతో ధాన్యం కొనుగోలు చేయడానికి ఇబ్బందిగా ఉందని నిర్వాహకులు తెలుపగా, త్వరలోనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో ఉన్న మిల్లులనూ ట్యాగ్ చేయించి ధాన్యాన్ని పంపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం బస్తాల వివరాలను ఆన్లైన్లో ఓపీఎంఎస్ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎంతమంది రైతుల దగ్గర ధాన్యం తీసుకున్నారు. ఎన్ని మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చిందని ఏపీఎం శోభను అడిగి తెలుసుకున్నారు. ఓపీఎంఎస్లను వెంటవెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా రామలింగేశ్వర సిరిధాన్యాల ఉత్పత్తిదారుల సంఘం వివరాలను ఏపీఎం ద్వారా అడిగి తెలుసుకున్నారు. మామిడి రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. మామిడి కాయలను కొనుగోలు చేసి మార్కెట్కు విక్రయించాలన్నారు. రైతులకు లాభాలు వచ్చేలా చూడాలన్నారు. కలెక్టర్ వెంట కులకచర్ల తహసీల్దార్ అశోక్కుమార్, ఎంపీవో సుందర్, మండల వైద్యాధికారి డాక్టర్ మురళీకృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
దోమ మండలం బొంపల్లిలో..
దోమ, మే 23 : మండలంలోని బొంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్ను కలెక్టర్ పౌసుమి బసు తనిఖీ చేశారు. ఏఎన్ఎం ఎంసీడీ రికార్డులు సరిగా రాయక పోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు రికార్డులను రాయాలని ఏఎన్ఎం సలీమాను ఆదేశించారు. కలెక్టర్ వెంట ప్రభుత్వ వైద్యాధికారి మునీబ్ సబ్ సెంటర్ సిబ్బంది ఉన్నారు.