పరిగి టౌన్, జూలై 25 : మహిళా రైతు బతికుండగానే చనిపోయినట్లు నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి రూ.5లక్షల రైతు బీమా డబ్బులు కాజేసిన రైతు సమన్వయ సమితి కోఆర్టినేటర్ రాఘవేందర్రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ లక్ష్మీరెడ్డి తెలిపారు. ఆదివారం పరిగిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కులకచర్ల మండలం పుట్టపహాడ్కు చెందిన ఎనుగొండ చంద్రమ్మ(57) అదే గ్రామానికి చెందిన రాఘవేందర్రెడ్డి ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్నది. అతను చెప్పిన మాట కాదనకపోవడంతో ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న రాఘవేందర్రెడ్డి 2020 సెప్టెంబర్ 14న చంద్రమ్మ మృతిచెందినట్లు గ్రామపంచాయతీ కార్యాలయం నుంచి నకిలీ ధ్రువపత్రం సృష్టించాడు. దీంతో రైతు బీమా పరిహారం కోసం దరఖాస్తు చేశాడు. సంబంధిత ఏఈవో సత్తార్, ఏవో వీరస్వామి విచారణ జరుపకుండా రైతు బీమా మంజూరు కోసం సిఫారసు చేశారు.
రైతు బీమా ఆర్థిక సహాయం రూ.5లక్షలు 2020 డిసెంబర్ 9న చంద్రమ్మ నామిని కుమారుడైన బాలయ్య పేరిట కులకచర్ల ఎస్బీఐ ఖాతాలో జమయ్యాయి. అయితే రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ రాఘవేందర్రెడ్డి.. వడ్ల డబ్బులు నీ ఖాతాలో పడ్డాయని బాలయ్యను నమ్మించి కులకచర్లలోని ఓ హార్డ్వేర్ షాపు యజమానికి రూ.4 లక్షలు, గాధిర్యాల్ గ్రామానికి చెందిన మల్లేశ్ అనే వ్యక్తికి మరో లక్ష రూపాయలను ట్రాన్స్ఫర్ చేయించాడు. చంద్రమ్మ కుమారుడు బాలయ్య తల్లి పేరిట రైతు బంధు డబ్బులు రావడం లేదని గ్రహించి వ్యవసాయ శాఖ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడి అధికారులు మీ తల్లి మరణించిందని.. ఆమె పేరిట రూ.5లక్షలు నీ ఖాతాలో జమయ్యాయని చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటికే రాఘవేందర్రెడ్డి రూ.4.20లక్షలు ఖర్చు చేయగా మధు అనే వ్యక్తి ఖాతాలో రూ.80వేలుండగా..వాటిని పోలీసులు సీజ్ చేశారు. ఈమేరకు రాఘవేందర్రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు.