తాండూరు రూరల్, సెప్టెంబరు 21: అనుమతులు లేకుండా బయో డీజిల్ విక్రయిస్తున్న బంకును రెవెన్యూ అధికారులు, పోలీసులు మంగళవారం సీజ్ చేశారు. తాండూరు మండలంలోని గౌతాపూర్ సమీపంలో ఒక పాలీషింగ్ యూనిట్లో వెంకటేశ్, రాంశెట్టి బయో డీజిల్ బంక్ను నిర్వహిస్తున్నారు. అనుమతులు లేకుండా బయో డీజిల్ను కర్నాటక, మహారాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకుని లారీలు, జీపులు, ఆటోలకు విక్రయిసున్నారు. ఇండియన్ ఆయిల్, హెచ్పీ బంకుల డీజిల్ కంటే బయో డీజిల్ లీటర్ తక్కువగా లభిస్తున్నది. బంకు నిర్వాహకులు పంచాయతీ, రహదారులు, రెవెన్యూ, పెట్రోలియం శాఖల అధికారుల అనుమతులు లేకుండా బంకు కొనసాగిస్తున్నారు. అక్రమంగా బయో డీజిల్ బంకు కొనసాగుతున్నట్లు తహసీల్దార్కు ఫిర్యాదు అందింది. దీంతో మంగళవారం ఆర్ఐ రాజురెడ్డి, కరణ్కోట ఎస్సై ఏడుకొండుల ఆ స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. నిర్వాహకులు వెంకటేశ్, రాంశెట్టిలను విచారించారు. సొంత లారీల్లో డీజిల్ పోసుకుని నడుపుతున్నామని, వ్యాపారం చేయడం లేదని వారు తెలిపారు. తమ సొంత వాహనాలకు ట్రయల్ రన్ చేస్తున్నామన్నారు. అనుమతి లేకుండా బంకు నిర్వహించరాదని ఆర్ఐ రాజు తెలిపారు. బంకులో డీజిల్ 3 వేల లీటర్ల ఉందని తేల్చారు. ఎస్సై ఏడుకొండలు, ఆర్ఐలు బంకుకు తాళం వేయించారు. సివిల్ సప్లయ్ అధికారులు వచ్చి మరోసారి పరిశీలిస్తారని వారు స్పష్టం చేశారు.
మరో రెండు బంకుల పరిశీలన
గౌతాపూర్ సమీపంలోని పార్థసారధి ట్రాన్స్పోర్టుతోపాటు రిలయన్స్ పెట్రోల్ బంకు ఎదురుగా అక్రమంగా మరో బంకు కొనసాగుతున్నదనే ఆరోపణల నేపథ్యంలో ఆర్ఐ రాజు, ఎస్సై ఏడుకొండలు విచారణ చేపట్టారు. పార్థసారధి ట్రాన్స్పోర్టులో ఉన్న బంకుకు అన్ని అనుమతులు ఉన్నాయని పీఎస్ఎల్ మేనేజర్ వెంకట్రామ్రెడ్డి అధికారులకు తెలిపారు. అనుమతి పత్రాలు రెవెన్యూ, పోలీసులకు అందజేస్తామన్నారు. రిలయన్స్ పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న మరో బంకును కూడా అధికారులు పరిశీలించారు. అక్కడ ఎలాంటి పరికరాలు లేవని, అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతనే బంకు ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు తెలిపారు.